KCR.. పుష్కరాలపై ఎందుకింత నిర్లక్ష్యం.. మీ కంటే వాళ్లే నయం : విజయశాంతి
ABN , First Publish Date - 2022-03-17T16:27:57+05:30 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై..
హైదరాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ మండిపడ్డారు. గురువారం నాడు ఫేస్బుక్ వేదికగా సీఎం కేసీఆర్పై రాములక్క ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన పుష్కరాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపనపల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లిలతోపాటు ప్రాణహిత రాష్ట్రంలోకి అడుగుపెట్టే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరాలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేశారు’ అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
కేసీఆర్.. మీ కంటే వాళ్లే నయం..!
‘పుష్కరఘాట్ల దగ్గర భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా భూపాలపల్లి జిల్లాలో 22.70 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 13 కోట్లతో ప్రపోజల్స్ పంపగా.. ఇంతవరకూ కేసీఆర్ గవర్నమెంట్ స్పందించలేదు. బంగారు తెలంగాణ చేశామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. నెల రోజుల్లో పుష్కరాలు మొదలుకానున్నా.. ఇంకా ఘాట్ల వద్ద ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం 2010 డిసెంబర్లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయి. అప్పటి పాలకులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగానే నిర్వహించారు. స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి కాళేశ్వరం వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.72 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ.8 కోట్లు కేటాయించారు. అప్పట్లో 12 రోజుల పాటు రోజుకు దాదాపు లక్ష మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా ఈ పుష్కరాల్లో పాల్గొన్నారు. కానీ స్వంత రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్నా పుష్కరాలను మాత్రం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పుష్కరాలకు నిధులు విడుదల చెయ్ కేసీఆర్.. నీకంటే ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలే నయం’ అని రాములమ్మ విమర్శలు గుప్పించారు.