ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి.. కేటీఆర్ చర్యలు తీసుకుంటారా?: విజయశాంతి

ABN , First Publish Date - 2022-06-07T02:22:30+05:30 IST

మతపరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌పై బీజేపీ అగ్రనాయకత్వం కఠిన చర్యలు..

ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి.. కేటీఆర్ చర్యలు తీసుకుంటారా?: విజయశాంతి

హైదరాబాద్: మతపరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌పై బీజేపీ అగ్రనాయకత్వం కఠిన చర్యలు తీసుకుందని, మరి అలాంటి వ్యాఖ్యలే చేసిన ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి మంత్రి కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారిద్దరిపై చర్యలు తీసుకున్నప్పటికీ కేటీఆర్ ఇంకా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారని మండిపడ్డారు.


టీఆర్ఎస్ సయామీ కవల, మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా లైన్‌లోకి వచ్చి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అసదుద్దీన్ సోదరుడు, ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ తన బహిరంగ సభల్లో నేరుగా శ్రీరాముడు, సీతామాత సహా హిందూ దేవుళ్లను పేర్లు పెట్టి మరీ ప్రస్తావించి విమర్శించి, పరిహసించిన వీడియోలు యూట్యూబ్‌లో ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని విజయశాంతి అన్నారు. గోమాతను సైతం ఆయన అవమానించారని అన్నారు. మరి ఈయన విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ అంతే కఠిన వైఖరిని ప్రదర్శించగలరా? అని నిలదీశారు. 


ఆయన మాత్రమే కాదు, పలువురు హేతువాదులు, వామపక్షవాదులు, హైందవేతర మాతాలకు చెందిన మతవాదులు ఎందరో హిందూ దేవీదేవతలని, హిందు విశ్వాసాలు, ఆచార-సంప్రదాయాలను అవమానించి, విమర్శించిన వీడియోలు చాలా ఉన్నాయన్నారు. మరోపక్క కేరళలో PFI సంస్థ హిందువులు, క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం సాగిస్తోందని అన్నారు. వీరు తమ లక్ష్యానికి పిల్లల్ని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు.. వీరి విషయంలో కేటీఆర్, అసదుద్దీన్ స్పందన ఏమిటో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-07T02:22:30+05:30 IST