Vijayashanthi: ఏం కేసీఆర్.... బంగారు తెలంగాణ అంటే ఇదేనా?
ABN , First Publish Date - 2022-07-26T04:29:53+05:30 IST
సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రభుత్వం సర్కారీ బడులను నిర్లక్ష్యం చేస్తూ... కార్పోరేట్ విద్యాసంస్థలకు పెద్ద పీట వేస్తోందని ...
హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రభుత్వం సర్కారీ బడులను నిర్లక్ష్యం చేస్తూ... కార్పోరేట్ విద్యాసంస్థలకు పెద్ద పీట వేస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi)అన్నారు. టీఆర్ఎస్ (Trs) ప్రభుత్వ నిర్వాకం వల్ల సర్కారీ స్కూళ్లు నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్నాయని ఆమె ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటినా ప్రభుత్వం ఒక్క బడికీ పైసా ఇవ్వలేదని.. దీంతో హెడ్మాస్టర్లు అప్పులు చేసి స్కూళ్లు నడుపుతున్నారన్నారు.
‘‘మరో 20 రోజుల్లో పంద్రాగస్టు రానుంది. కనీసం అప్పటివరకైనా స్కూల్ గ్రాంట్స్ (School Grants) ఇస్తారో... లేదో... అని హెడ్మాస్టర్లు, టీచర్లు ఆందోళనలో ఉన్నారు. బడుల నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఏటా గ్రాంట్స్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల 852 స్కూళ్లకు రూ.12,500 నుంచి లక్ష వరకు రెండు విడతల్లో నిధులు ఇవ్వాల్సి ఉంది. గత నెల 13నే స్కూళ్లు రీఓపెన్ అయినప్పటికీ... ఇంతవరకూ నిధులు రిలీజ్ చేయలేదు. ఇది చాలక గతంలో ఇచ్చిన పైసలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎన్నికల ముందు కేజీ టు పీజీ అంటూ ఉదరగొట్టిన కేసీఆర్... ఇప్పటివరకు దీనిని అమలు చేసిన పాపాన పోలేదు. కనీసం ఉన్న బడులను నడిపించడానికి అవసరమైన నిధులను కూడా ఇవ్వడం లేదు. ఏం కేసీఆర్.... బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ప్రభుత్వ విద్యను గాలికొదిలేసి కార్పోరేట్ విద్యను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ సర్కార్కు తెలంగాణ (Telangana) ప్రజానీకమే తగిన బుద్ధి చెప్పడం ఖాయం.’’ అని విజయశాంతి హెచ్చరించారు.