రుణమాఫీ కోసం అన్నదాతల ఎదురుచూపు.. దద్దమ్మ సర్కార్ ఏం చేస్తోంది? : రాములమ్మ
ABN , First Publish Date - 2022-02-27T17:37:37+05:30 IST
రుణమాఫీ సకాలంలో అమలుకాకపోవడంతో తెలంగాణ రైతన్నల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని..
- టీఆర్ఎస్ హయాంలో ఆగమ్యగోచరంగా రైతన్నల పరిస్థితి
- బడ్జెట్ లో కోట్లు కేటాయిస్తున్నా.. పైసా రిలీజ్ చేయ్యని ప్రభుత్వం
- రుణాలు కట్టాలని రైతులకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకర్లు
హైదరాబాద్ సిటీ : రుణమాఫీ సకాలంలో అమలుకాకపోవడంతో తెలంగాణ రైతన్నల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని.. కేసీఆర్ సర్కార్పై రాష్ట్ర బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం నాడు ఫేస్బుక్ వేదికగా రైతన్నల సమస్యలపై రాములమ్మ ఓ పోస్ట్ పెట్టారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకు వేల కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నా.. నిధులు మాత్రం పైసా కూడా విడుదల చేయ్యడం లేదేం అంటూ సర్కార్పై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
ఫేస్బుక్ పోస్ట్ యథావిధిగా..!
‘‘రైతురుణాల మాఫీలో ఈ చేతగాని దద్దమ్మ సర్కార్.. ఈ మూడేండ్లలో 17 వేల కోట్లు కేటాయిస్తే.. రూ.3వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. దీనిలో తొలిసారి రూ.400 కోట్లు, రెండోసారి రూ.300 కోట్లు తిరిగి ప్రభుత్వ సంచిలోకే చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా... రూ.25 వేలలోపు రైతులు 2.96 లక్షల మంది, రూ.50వేలలోపు రైతులు నాలుగున్నర లక్షల మందికి మాత్రమే మాఫీ చేసి ఈ దొంగ సర్కార్ చోద్యం చూస్తుంది... ప్రభుత్వం రుణమాఫీ చెల్లిస్తుంది కదా అని రైతులు ఏండ్లుగా ఎదురుచూస్తూ ఉండటంతో వడ్డీకి వడ్డీ పెరిగి రైతుల నడ్డి విరిగిపోతోంది. సరైన సమయానికి ఈ నక్కజిత్తుల కేసీఆర్ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల దృష్టిలో మొండి బకాయిదారులుగా మారారు.. దీంతో మళ్లీ రుణాలు తీసుకునేందుకు వారంతా ఛాన్స్ కోల్పోయి బోరుమంటున్నారు... రాష్ట్రంలో సుమారు 34 లక్షల మంది రైతులు తమ బ్యాంకు రుణం ఎప్పుడు మాఫీ అవుతుందా అని కండ్లల్లో వొత్తులు వేసుకుని ఎదురు చూస్తూనే ఉన్నారు’’ అని రాములమ్మ చెప్పుకొచ్చారు.
బుద్ధి చెప్తామని హెచ్చరిక..
‘‘రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం నుంచి రాకపోవడంతో... రైతులకు వచ్చిన రైతుబంధు పైసలు, ధాన్యం అమ్మిన సొమ్మును బ్యాంకర్లు అప్పులు, వడ్డీ కిందికి జమ చేసుకుంటున్నారు.. మూడేండ్ల సంది రైతుల పంట రుణాలు పెండింగ్లో ఉన్నాయి... దీంతో బ్యాంకు అధికారులు అప్పులు చెల్లించని, కనీసం లోన్లను రెన్యువల్ చేయని రైతుల అకౌంట్లను మొండి బకాయిలుదారుల జాబితాలో పెడుతున్నారు. ఈ పనికిమాలిన టీఆర్ఎస్ సర్కార్ మూడేండ్ల సంది రైతులను నానా అవస్థలకు గురిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం కూడా కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు... కేసీఆర్ అప్రజాస్వామిక పాలనలో రైతన్నలు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. అన్నదాతలను పట్టించుకోని ఈ సర్కార్కు త్వరలోనే బుద్ధి చెప్పటం ఖాయమని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నియంతృత్వ కేసీఆర్ సర్కార్ కు రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు’’ అని రాములక్క చెప్పారు.