KCR.. వారు మీ ప్రజలు కాదా.. వారివి ఓట్లు కావా? : రాములమ్మ

ABN , First Publish Date - 2021-07-27T00:45:04+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ..

KCR.. వారు మీ ప్రజలు కాదా.. వారివి ఓట్లు కావా? : రాములమ్మ

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై మరోసారి మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రాములమ్మ.. దళిత బంధు పథకం కేసీఆర్ నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయమన్నారు. అయితే.. గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం, దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్‌ని నమ్మే పరిస్థితులు లేవని విమర్శలు గుప్పించారు. అలాగే దళిత బంధు పథకానికి కేవలం రూ.1200 కోట్లు కేటాయించి, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పకుండా కేసీఆర్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని రాములక్క మండిపడ్డారు.


వారు ప్రజలు కాదా..!?

గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ విషయంలో.. 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పలేదని తప్పించుకున్న ఘనత ఈ సీఎం గారిది. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ళు మొత్తం డిమాండ్‌కు చాలినన్ని కట్టలేని ఈ ప్రభుత్వం వెళుతున్న వేగానికి మరో 60 ఏళ్ళు పట్టేట్టుంది. ఇప్పుడు దళిత బంధు పథకానికి కూడా వీరి కేటాయింపులను బట్టి చూస్తే 160 సంవత్సరాలు పట్టవచ్చు. ఇక హుజురాబాద్ ఎన్నికల కోసం పైలెట్ ప్రాజెక్ట్ పెట్టినం... ఇది పక్కాగా ఎన్నికల్లో ఓట్ల కోసమే చేస్తున్నాం. అన్న సీఎం గారు.. ఇది ఓట్ల పథకం అయినప్పుడు, ఆ నియోజకవర్గంలోని మిగతా కులాలకు చెందిన సుమారు 70 వేల పైచిలుకు కుటుంబాలకు కూడా ఇలా 10 లక్షల చొప్పున నిధుల కేటాయింపు ఎందుకు చెయ్యలేదు?. వారు మీ ప్రజలు కాదా? వారివి ఓట్లు కావా? ఆయా వర్గాల ప్రజలందరూ ఈ విషయమై తమ 10 లక్షలు తమకు ఇచ్చేంతవరకూ గ్రామ గ్రామానా టీఆరెస్ నేతలను నిలదీయాలి. స్పష్టమైన దళిత సాధికారతను, దళిత బంధును మనస్ఫూర్తిగా స్పాగతించి తీరుతం. అయితే, ఓట్ల పథకమన్నప్పుడు దానిపై హుజురాబాద్‌లో అన్ని సామాజిక వర్గాల వారికీ హక్కు ఉంటుంది అని రాములమ్మ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-07-27T00:45:04+05:30 IST