Kaleswaram ప్రాజెక్ట్తో కేసీఆర్ కుటుంబానికే లాభం..
ABN , First Publish Date - 2022-07-29T00:25:16+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram project) ద్వారా ప్రజల కంటే సీఎం కేసీఆర్ (kcr) కుటుంబానికే ఎక్కువ లాభం జరిగిందని బీజేపీ (bjp) నేత విజయశాంతి (Vijayashanthi)..
Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram project) ద్వారా ప్రజల కంటే సీఎం కేసీఆర్ (kcr) కుటుంబానికే ఎక్కువ లాభం జరిగిందని బీజేపీ (bjp) నేత విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు. కమీషన్ల కోసం అవసరం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ను రీడిజైన్ చేయించి వేల కోట్లు వెనకేసున్నాడని దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా గురువారం ఆమె పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే...
‘‘కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నడు. తాజాగా సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మూడో టీఎంసీ పనుల్లో స్టేటస్ కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని స్పష్టం చేసింది. భూసేకరణ గురించి పక్కనపెడితే... ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. భూసేకరణ లావాదేవీలను సమగ్రంగా నమోదు చేస్తామని, భూసేకరణ చట్టబద్ధతను హైకోర్టు తేల్చాలని పేర్కొంది. దీనిపై ఆగస్టు 16లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రజల కంటే కేసీఆర్ కుటుంబానికే ఎక్కువ లాభం జరిగింది... జరుగుతోంది.
‘‘కమిషన్ల కోసం కక్కుర్తితో... అవసరం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ను రీడిజైన్ చేయించి కేసీఆర్ వేల కోట్లు వెనకేసుకున్నడు. కనీసం ఆ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కూడా లేవు. ఇప్పటికే గోదావరి వరదలకు కాళేశ్వరం పంపులు పూర్తిగా మునిగిపోయాయి. దీన్ని బట్టే అర్థం అవుతోంది.... ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, కమిషన్ల ప్రాజెక్ట్ అని... కేసీఆర్... నువ్వు ఎన్ని రోజులు మభ్యపెట్టినా... నీ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉండదు. త్వరలోనే తెలంగాణ సమాజం నీకు, నీ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెబుతుంది’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.