హుజురాబాద్లో మేమే గెలుస్తాం: రాములమ్మ
ABN , First Publish Date - 2021-08-25T18:38:06+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీయే గెలుస్తుందని విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీయే గెలుస్తుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ బై ఎలక్షన్లో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్కు పట్టుకుందని, అందుకే ఆ బంద్.. ఈ బంద్ అని అంటున్నారని విమర్శించారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని, ఈ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాములమ్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమవుతుందని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో అవినీతి పాలన ఏ రకంగా ఉందన్నది ప్రజలకు వివరిస్తారని, అలాగే ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజీపీయే ప్రత్యమ్నాయని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని విజయశాంతి అన్నారు.