కేసీఆర్ ఎన్నోసార్లు గప్పాలు కొట్టి మోసం చేశారు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-10-15T04:10:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తుందని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు గప్పాలు కొట్టి నేడు రైతులను మోసం చేస్తున్నారని...

కేసీఆర్ ఎన్నోసార్లు గప్పాలు కొట్టి మోసం చేశారు: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తుందని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు గప్పాలు కొట్టి నేడు రైతులను మోసం చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఇప్పటికే వానాకాలం వరి పంటను కోసిన రైతన్నలు ధాన్యాన్ని ఎక్కడికి తరలించి అమ్మకం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నా పట్టింపులేనట్టుగా సీఎం కేసీఆర్ వ్యవరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. 


‘‘గత యాసంగిలో ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లలో రైతుల్ని నానా ఇబ్బందులకు గురిచేసిన రాష్ట్ర సర్కార్.... ఈ  వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర సర్కార్ ఇంకా ప్రతిపాదనలు పంపకుండా కాలయాపన చేస్తూ రైతులను భయాందోళనలో నెట్టేస్తోంది. ఇక సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని ప్రకటించారు. ఈ యాసంగి వరిసాగు చేయొద్దని వ్యవసాయశాఖ నుంచి ప్రతి పాదనలు చేయించి... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడమే కానీ... ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను సిద్ధం చేయడం, మార్కెట్లో అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టలేదు. ఎలాంటి భరోసా ఇవ్వకుండా రైతులను ఆందోళనలో పడేసిన్రు. ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, మినుములు, పెసర, శనగ వంటి పంటలను వరికి బదులుగా సాగుచేయాలని వ్యవసాయశాఖ ద్వారా చెప్పించి, వాటిని ఏ ప్రాంతంలో ఎంతెంత సాగు చేయాలన్న దానిపై ప్రణాళిక ఖరారు చేయకపోవడం సిగ్గుచేటు. కొంత మంది రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు.’’ అని విజయశాంతి తెలిపారు. 


ఇప్పటికే నార్లు పోయడానికి పొలాన్ని చదును చేస్తున్నా వారికి దారీ తెన్నూ లేకుండా చేస్తున్నారని విజయశాంతి చెప్పారు. అసలు ఈ వానాకాలంలో పండించిన పెసర, మక్కలు, ఇతర పంటలను సైతం మార్కెటింగ్ చెయ్యడానికి రైతులు ఇబ్బందులు పడడమే కాకుండా.... సరైన మద్దతు ధర ప్రకటన లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇక ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకం ఇవ్వాలన్న ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకోకుండా సీజన్ మొదలైనా హుజురాబాద్ ఎన్నికలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్... నోట్ల ద్వారా ఓట్లను కొనాలని వ్యూహరచనలు, అబద్దపు ప్రచారాలు చేయిస్తున్నారు. రైతులను పక్కన పెట్టేసిన రాష్ట్ర సర్కార్‌కు యావత్ తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పి టీఆర్ఎస్ పార్టీని బొందపెడతారు.’’ అని విజయశాంతి విమర్శించారు. 

Updated Date - 2021-10-15T04:10:00+05:30 IST