పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయాలు ఇవే: Vijayasai reddy
ABN , First Publish Date - 2021-07-15T21:06:43+05:30 IST
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయాలు ఇవే: Vijayasai reddy
అమరావతి: వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. పార్లమెంట్లో పోలవరం నిధుల అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు. కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరుతామన్నారు. తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల కింద చుక్క నీరు అదనంగా తీసుకోమని, 800 అడుగుల్లోనే లిఫ్ట్కి అనుమతి ఇవ్వాలన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణ అనేక ప్రాజెక్ట్లు కట్టిందని, ఉమ్మడి ప్రాజెక్ట్లను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. క్యారెక్టర్ లేని వ్యక్తి నరసాపురం ఎంపీ గురించి ఈ మీటింగ్లో చర్చించాల్సిన అవసరం లేదన్నారు.
దిశ చట్టాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉపాధిహామీలో 6,750 కోట్లు బకాయిలు వచ్చేలా పోరాడతామన్నారు. విభజన చట్టంలో అమలు కాని హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఢిల్లీలో 12 సందర్భాల్లో ప్రత్యేక హోదా కావాలని సీఎం జగన్ కేంద్ర పెద్దల్ని కలిసి కోరారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. జల వివాదంపై కేంద్రం సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.