రెండు ఏకగ్రీవం.. ఒక్కదానికే పోటీ!
ABN , First Publish Date - 2020-09-24T17:29:17+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ లో ఎన్నికలకు సంబంధించి..
విజయ డెయిరీలో మొదలైన ఎన్నికల పర్వం
మూడు పదవులకు నాలుగు నామినేషన్లు
ప్రస్తుత చైర్మన్కే పోటీ...
ఉపసంహరణకు నేటి సాయంత్రం వరకు గడువు
నెల్లూరు: ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ లో ఎన్నికలకు సంబంధించి బుధవారం నామి నేషన్ల స్వీకరణ జరిగింది. ప్రస్తుత చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డితోపాటు ఇద్దరు మహిళా డైరెక్టర్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే మహిళా అభ్యర్థులుగా కోవూరు మండలం మోడేగుంట పాల సొసైటీ సభ్యురాలు కన్నా ఇందిరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాంబపురం పాల సొసైటీ సభ్యురాలు సూదలగుంట సాయి నిరోషా మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
దీంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. వారిద్దరూ ప్రస్తుత చైర్మన్ వర్గీయులే కావడం గమనార్హం. ఇక చైర్మన్ రంగారెడ్డికి పోటీగా ముత్తుకూరు మండలం నారికేళపల్లి పాల సొసైటీ సభ్యుడు కోట చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం వరకు గడువు ఉంది. వారిద్దరూ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే ఈ నెల 26న పోలింగ్ జరుగుతుంది.