ఐపీఎల్: కీలక తరుణంలో సన్‌రైజర్స్‌కు షాక్

ABN , First Publish Date - 2020-10-31T22:40:09+05:30 IST

ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. దీంతో.. ప్లే ఆఫ్‌కు చేరుకునేందుకు పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లన్నీ...

ఐపీఎల్: కీలక తరుణంలో సన్‌రైజర్స్‌కు షాక్

ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. దీంతో.. ప్లే ఆఫ్‌కు చేరుకునేందుకు పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లన్నీ చెమటోడుస్తున్నాయి. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై జట్టు మినహా మిగిలిన జట్లకు తదుపరి మ్యాచ్‌ల్లో విజయం కీలకం కానుంది. అలాంటి జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈ జట్టు ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అయితే.. రన్‌రేట్ మెరుగ్గా ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇవాళ.. బెంగళూరు జట్టుతో తలపడబోతున్న ఈ జట్టుకు కీలక దశలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టులో కీలకంగా ఉన్న ఆల్‌రౌండర్ విజయశంకర్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. గాయం కారణంగా విజయశంకర్ ఈ టోర్నీకే దూరం కాబోతున్నట్లు తెలిసింది. ఈ సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఆడిన విజయ్‌శంకర్ 97 పరుగులు చేశాడు.


రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 13 సీజన్‌లో సన్‌రైజర్స్‌ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయం కారణంగా సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే టోర్నీకి దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా జట్టులో లేడు. వీరిద్దరి స్థానాల్లో పృథ్వీ రాజ్ యర్రా, హోల్డర్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-10-31T22:40:09+05:30 IST