విజయకాంత్, ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపు
ABN , First Publish Date - 2020-10-14T17:09:19+05:30 IST
డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ప్రముఖ తమిళ సినీ నటుడు ధనుష్ నివాసాలకు బాంబు బెదరింపులు రావటంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆ రెండిళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు...
చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ప్రముఖ తమిళ సినీ నటుడు ధనుష్ నివాసాలకు బాంబు బెదరింపులు రావటంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఆ రెండిళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చెన్నై ఎగ్మూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సాలిగ్రామంలో ఉన్న డీఎండీకే అధ్యక్షుడు విజయ కాంత్ నివాసంలో బాంబులున్నాయని, త్వరలో అవి పేలనున్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో కంట్రోల్రూం సిబ్బంది ఆ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. విరుగంబాక్కం పోలీసులు బాంబ్ స్క్వాడ్తో సాలిగ్రామంలో ఉన్న విజయకాంత్ నివాస గృహానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో ఆ నివాసంలోని అన్ని గదులలోనూ తనిఖీ చేశారు. చివరకు అది ఉత్తుత్తి బాంబు బెదరింపు అని తేలటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తనిఖీల సందర్భంగా విజయకాంత్ నివాసం వున్న ప్రాంతంలోని రహదారిలో వాహనాల రాకపోకలను కూడా కాసేపు నిలిపివేశారు.
అది గడిచిన కొద్దిసేపటికే మళ్లీ పోలీసు కంట్రోల్రూంకు గుర్తు తెలియిని వ్యక్తి ఫోన్ చేసి చెన్నై అభిరామపురంలో ఉన్న నటుడు ధనుష్ నివాసంలో బాంబులున్నాయని, అవి పేలనున్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే ఆ విషయాన్ని కంట్రోలు రూం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు, బాంబ్స్క్వాడ్, పోలీసు జాగిలాలతో అభిరామపురం వెంకటేశ్వరా అపార్ట్మెంట్లో ఉన్న ధనుష్ నివాసానికి చేరుకున్నారు. అన్ని గదుల్లోనూ మెటల్ డిటెక్టర్లతో తనిఖీల జరిపారు. సుమారు గంటకు పైగా ఈ తనిఖీలు కొనసాగాయి. చివరకు ఇది కూడా ఉత్తుత్తి బాంబు బెదిరింపేనని పోలీసులు నిర్ధారించారు. కంట్రోలు రూంలో నమోదైన నెంబర్ను బట్టి బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మరక్కాణం ప్రాంతానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. ఆ దుండగుడు మతిస్థితిమితం లేని వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరక్కాణం పోలీసులు బాంబు బెదరింపు ఫోన్ చేసిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నగరంలో ఒకే రోజు విజయకాంత్, ధనుష్ నివాసాలకు బాంబు బెదరింపులు రావటం తీవ్ర కలకలం సృష్టించింది.