అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ
ABN , First Publish Date - 2020-03-29T11:03:52+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి వైద్యఆరోగ్యశాఖ అధికారులు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
జీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు
జీజీహెచ్(కాకినాడ), మార్చి 15: జిల్లాలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి వైద్యఆరోగ్యశాఖ అధికారులు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్లో వీరికి పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ వార్డులో వీరి ఉంచుతున్నారు. వీరిలో ఇప్పటివరకు ఎవరికీ వ్యాధి నిర్ధారణ కాలేదు.
కరోనా వైరస్ పుట్టుక
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. వూహాన్ సముద్ర ఆహార మార్కెట్లో ఈ వైరస్ను గుర్తించారు. అనంతరం తిరిగి 2019, డిసెంబరు 1న గుర్తించారు. 2020 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా వేల కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. చైనాలోని వూహాన్లో ఈ వైరస్ సోకి వేలసంఖ్యలో ఆ దేశీయులు మృత్యువాత పడడంతో కరోనా వైరస్పట్ల ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించింది. ఈ వైరస్ నియంత్రణకు ఎటువంటి టీకాలు లేవు. కరోనా వైరస్ అంటే కిరీటం అని అర్థం. దీన్ని మైక్రో స్కోప్లో పరిశీలించినప్పుడు ఇది కిరీటం ఆకృతిలో కన్పించడంతో కరోనా వైరస్ పేరు పెట్టారు. కరోనా వైరస్ సోకిన తర్వాత జబ్బు లక్షణాలు బయట పడేందుకు 1నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అందువల్ల కోవిడ్-19 పేరు పెట్టారు.
వైరస్ అంటే..
కరోనా వైరస్లు మానవులతో సహా క్షీరదాల ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. ఈ వైరస్ జలుబు, న్యూమోనియా. తీవ్రమైన ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(ఎస్ఏఆర్ఎస్)తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మానవ శరీరంలోని పేగులపై ప్రభావం చూపుతుంది. కరోనా వైరస్ పక్షిజాతుల్లో కూడా వ్యాప్తి చెందుతుంది. సాధారణ జలుబునుంచి ప్రాణాంతకమైన న్యూమోనియా వరకు ఈ వైరస్ సోకుతుంది.
ఇప్పటివరకు 16మందికి పరీక్షలు
జూ విదేశాలనుంచి జిల్లాకు వస్తున్న వారికి కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 16మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఇటీవల కువైట్నుంచి వచ్చిన పలువురిని ఇక్కడకు రప్పించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి మొదటివారంలో.. చైనా దేశంలోని వూహాన్ రాష్ట్రం టాంగ్జీ యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న కాకినాడకు చెందిన ఓ యువకుడు, సామర్లకోట మండలం నవరకు చెందిన మరో యువకుడు, యానానికి చెందిన యువకుడు ఈ ముగ్గురికి తొలుత జీజీహెచ్లో వైరస్ పరీక్షలు నిర్వహించారు. పూనే నుంచి వచ్చిన రిపోర్టులో ఈ ముగ్గురికి నెగిటివ్ వచ్చింది.
మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన 50ఏళ్ల మహిళ, సౌత్కొరియా నుంచి వచ్చిన కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన 36ఏళ్ల పురుషుడికి, ఇంగ్లాండ్నుంచి వచ్చిన అంబాజీపేటకు చెందిన 26ఏళ్ల పురుషుడికి, వైరస్ పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.