ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-07-03T06:22:38+05:30 IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవెంకటలక్ష్మి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడిచేసి రూ.10 లక్షల విలువైన 51 టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు.

ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ దాడులు
అనంతవరంలోని ఎరువుల దుకాణం వద్ద విజిలెన్స్‌ అధికారులు

రూ.10 లక్షల విలువైన 51 టన్నుల ఎరువులు సీజ్‌

పద్మనాభం/పద్మనాభం రూరల్‌, జూలై 2: విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవెంకటలక్ష్మి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడిచేసి రూ.10 లక్షల విలువైన 51 టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు. విశాఖ విజిలెన్స్‌ ఎస్పీ జి.స్వరూపారాణి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు చేశారు.


ఎస్పీ కథనం మేరకు... పర్లంకి చిట్టిబాబు అనే వ్యాపారి గ్రామంలో ప్రభుత్వ అనుమతితో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే రైతుల నుంచి ఎమ్మార్పీ కంటే రూ.60లు అదనంగా డీఏపీ బస్తా విక్రయిస్తున్నాడని గుర్తించారు. రైతులకు విక్రయించినట్లు తప్పుడు బిల్లులు చూపించి 40 టన్నుల డీఏపీ అనధికారికంగా నిల్వ చేశాడని గుర్తించారు. అలాగే యూరియా, ఇతర ఎరువులు మరో పదకొండు టన్నులు అక్రమ నిల్వలని మొత్తం 51 టన్నులు సీజ్‌ చేశారు.


స్టాంపింగ్‌ లేకుండా తూనిక యంత్రం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో చిట్టిబాబుపై అక్రమ నిల్వలు, లీగల్‌ మెట్రాలజీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్వరూపరాణి తెలిపారు. ఈ దాడిలో డీఎస్పీ అన్నెపు నర్శింహమూర్తి, ఏఏవో కృష్ణవేణి, వ్యవసాయ సహాయకులు సింహాచలం, సిబ్బంది మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:22:38+05:30 IST