విజిలెన్స్ అదుపులో దర్శన టికెట్ల దళారులు
ABN , First Publish Date - 2022-01-25T01:01:09+05:30 IST
తిరుమలలో రూ.300 దర్శన టికెట్లు అధిక ధరకు విక్రయించే ఇద్దరు దళారీలను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల: తిరుమలలో రూ.300 దర్శన టికెట్లు అధిక ధరకు విక్రయించే ఇద్దరు దళారీలను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడపకు చెందిన వినయ్, తిరుమలలో ప్రైవేట్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్న వేణు ఈ నకిలీ టికెట్లు విక్రయ వ్యవహారంలో ఉన్నట్టు గుర్తించారు. అవసరమైన డేటా మార్పులు చేసి ఏడు నకిలీ టికెట్లను విక్రయించిన ట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. జనవరి 23వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల స్కానింగ్ కౌంటర్ల వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి నకిలీ టికెట్లను గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సైదులును విచారించగా, తమకు వేణు, వినయ్ అనే వ్యక్తులు ఈ నకిలీ టికెట్లను విక్రయించినట్లు తెలిపారు. వారికి గూగుల్పే ద్వారా రూ.5,600 క్యాష్, నగదు రూపంలో రూ.వెయ్యి అందించినట్లు తెలిపారు. భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇద్దరు దళారీలపై తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.