ద్వారకా బస్స్టేషన్ దుకాణాలలో విజిలెన్స్ తనిఖీలు
ABN , First Publish Date - 2022-06-26T06:35:04+05:30 IST
ద్వారకా బస్స్టేషన్లోని వివిధ షాపుల్లో పీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
55 షాపులకు జరిమానా
ద్వారకాబస్స్టేషన్, జూన్ 25: ద్వారకా బస్స్టేషన్లోని వివిధ షాపుల్లో పీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, అన్లేబుల్ సరకులు విక్రయిస్తున్నారని, కేటాయించినదాని కంటే ఎక్కువ స్థలంలో షాపులు ఏర్పాటు చేశారని, కాలంచెల్లిన తినుబండారాలు అమ్ముతున్నారని పలువురు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించినట్టు 55 దుకాణాలను గుర్తించి, ఆయా షాపుల యజమానులకు రూ.వెయ్యి వంతున జరిమానా విధించారు. పీటీడీ విశాఖ రీజియన్ విజిలెన్స్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మోహనరావు, ఏఈ సత్యనారాయణ, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నరసింహమూర్తి ఈ తనిఖీలు నిర్వహించారు.