పశుపోషణపై యూట్యూబ్‌లో వీడియోలు... నెలకు 5 లక్షల ఆదాయం!

ABN , First Publish Date - 2021-01-09T14:55:07+05:30 IST

రామ్దె, భారతి దంపతులు ఒక యూట్యూబ్ వీడియోలో పశువులకు గడ్డి తినిపిస్తూ...

పశుపోషణపై యూట్యూబ్‌లో వీడియోలు... నెలకు 5 లక్షల ఆదాయం!

పోర్‌బందర్: రామ్దె, భారతి దంపతులు ఒక యూట్యూబ్ వీడియోలో పశువులకు గడ్డి తినిపిస్తూ, మరో వీడియోలో కట్టెల పొయ్యిపై వంట వండుతూ, ఇంకో వీడియోలో పొలంలో పనిచేస్తూ కనిపిస్తుంటారు. అలాగే గ్రామంలోని పెద్దలతో మాట్లాడుతూ కూడా వీడియోలలో కనిపిస్తుంటారు. వీరు రూపొందించే వీడియోలకు స్క్రిప్ట్ ఉండదు. ఎడిటింగ్ కూడా అంతగా ఉండదు. అయితే యూట్యూబ్‌లోని ఈ వీడియోలకు అమితమైన ఆదరణ దక్కుతోంది. ఈ విధంగా రామ్దె, భారతి జంట యూట్యూబ్ ద్వారా నెలకు ఐదు లక్షల వరకూ సంపాదిస్తున్నారు.


రమ్దె, భారతి గతంలో బ్రిటన్‌లో ఉండేవారు. ఉన్నత చదువులు చదువుకున్నవీరిద్దరూ మంచి జీతం వచ్చే ఉద్యోగాలు చేసేవారు. అయితే రమ్దె మనసు ఎప్పుడూ తన గ్రామం చుట్టూనే తిరుగుతుండేది. పైగా తల్లిదండ్రులు కూడా గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలోని ఒక గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ సందర్భంగా రమ్దె మాట్లాడుతూ తాను తల్లిదండ్రులకు ఒక్కడినే సంతానమని, వారిని చూసుకునేందుకు భార్యతో పాటు 2016లో గ్రామానికి వచ్చేశానని తెలిపారు. వ్యవసాయంతోపాటు పశుపోషణ కూడా చేపట్టానన్నారు. అదే సమయంలో గ్రామానికి సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయాలని అనిపించింది. దీంతో పశువుల పోషణకు సంబంధించిన వీడియోలు పోస్టు చేశానని, మెల్లమెల్లగా తన వీడియోలకు వ్యూస్ పెరిగి, మూడు లక్షలకు చేరుకున్నదన్నారు. ఆరు నెలల్లోనే తమ యూట్యూబ్ ఛానల్ మోనిటైజ్ అయ్యిందని, అప్పటి నుంచి రోజుకు క్రమం తప్పక ఒక వీడియోను పోస్టు చేస్తున్నామని తెలిపారు. తరువాత మూడు ఛానల్స్ ప్రారంభించామన్నారు. ఇప్పుడు నెలకు ఐదు లక్షల వరకూ ఆదాయం వస్తున్నదన్నారు. ఇప్పటివరకూ తమ ప్రధాన ఛానల్‌కు ఏడు లక్షలకు మించిన సబ్ స్క్రైబర్లు ఉన్నారని, ప్రతీరోజూ కొత్తగా మరో వెయ్యిమంది చేరుతుంటారని రమ్దె తెలిపారు.

Updated Date - 2021-01-09T14:55:07+05:30 IST