80-20 విజయం ఇది: ఒవైసీ

ABN , First Publish Date - 2022-03-12T18:36:00+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను '80-20 విక్టరీ'గా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..

80-20 విజయం ఇది: ఒవైసీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను '80-20 విక్టరీ'గా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో దశాబ్దాలుగా ఇదే వాతావరణం కొనసాగుతూ వస్తోందని అన్నారు. యూపీలో ఎంఐఎం ఖాతా కూడా తెరకపోవడాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రజా విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో గుర్తించి భవిష్యత్తులో మరింత కష్టపడి పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఎంఐఎంకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ''రాజకీయ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈవీఎంలపై రగడ చేస్తున్నాయి. నిజానికి ఈవీఎంలలో తప్పులేదని 2019లో కూడా నేను చెప్పాను. ప్రజల బుర్రల్లో చిప్ ఉంది. అదే కీలక పాత్ర పోషిస్తోంది'' అని ఆయన అన్నారు.


యూపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ''80-20'' వ్యాఖ్యలు కొద్దికాలంగా విస్తృత ప్రచారంలో వచ్చాయి. 80 మంది మద్దతుదారులు ఒకవైపు, 20 మంది మద్దతుదారులు మరో వైపు ఉన్నారని, 80 శాతం మంది పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్తుంటే, 20 శాతం మంది ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారని, వ్యతిరేకించడమే వారి పని అని యోగి వ్యాఖ్యానించారు. యూపీ జనాభాలో ముస్లిం జనాభా 20 శాతం ఉండటం కూడా యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకోవడానికి ఒక కారణం.

Updated Date - 2022-03-12T18:36:00+05:30 IST