గెలుపు మనదే

ABN , First Publish Date - 2021-02-28T05:35:08+05:30 IST

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈసారీ టీడీపీ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ఉద్ఘాటించారు.

గెలుపు మనదే
మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల

  1. కర్నూలు కోటపై టీడీపీ జెండా
  2. అండగా ఉంటాం... భయం వద్దు
  3. కర్నూలు నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో నాయకులు


కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 27: కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈసారీ టీడీపీ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ఉద్ఘాటించారు. కార్పొరేటర్‌ అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని అభయమిచ్చారు. శనివారం తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం ఆ పార్టీ ఇన్‌చార్జి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో మౌర్యఇన్‌లో నిర్వహించారు. టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం 52 వార్డుల అభ్యర్థులు పరిచయం చేసుకున్నారు. టీజీ భరత్‌ మాట్లాడుతూ గతంలో టీడీపీ కార్పొరేటర్ల వార్డుల్లో అభివృద్ధి ఎలా ఉందో? ఇతర పార్టీల కార్పొరేటర్ల వార్డుల్లో అభివృద్ధి ఎలా ఉందో? ప్రజలకు వివరించాలన్నారు. ప్రచార ఆర్భాటాలకు పరిమితం కాకుండా తాము గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కోట్ల, కేఈ, టీజీ కుటుంబాల వల్లే జరిగిందని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. కర్నూలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని సీఎంను అడిగే ధైర్యం వైసీపీ నాయకులకు లేదని, అందుకే వారు జేబులు నింపుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. సోమిశెట్టి మాట్లాడుతూ మార్చి 4న నగరంలో భారీ ఎత్తున రోడ్‌షోను నిర్వహిస్తున్నామని, ముఖ్య నాయకులంతా పాల్గొనాలని అన్నారు. కల్లూరు పరిధిలో కూడా రోడ్‌షోకు తేదీని ఖరారు చేస్తామన్నారు. 

సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే, పాణ్యం ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి, తెలుగు మహిళ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌, కర్నూలు నగర అధ్యక్షుడు తిరుపాల్‌ బాబు, నాగేంద్రకుమార్‌, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, పార్వతమ్మ, సుకన్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T05:35:08+05:30 IST