Vice presidential election: పూర్తయిన ఓటింగ్... కౌంటింగ్ షురూ..
ABN , First Publish Date - 2022-08-06T23:37:09+05:30 IST
ఉప రాష్ట్రపతి ఎవరనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. పార్లమెంటు హాలులో ఉదయం 10 గంటలకు...
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి (Vice President) ఎవరనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. పార్లమెంటు హాలులో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. లెక్కింపు పూర్తికాగానే ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. 725 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగ్దీప్ ధన్కఢ్ బరిలో ఉండగా, ప్రతిపక్షాల తరఫున మార్గెరెట్ ఆల్వా పోటీలో ఉన్నారు. ధన్కఢ్కు తగిన ఉన్న మద్దతు దృష్ట్యా ఆయన విజయం లాంఛనమేనని అంటున్నారు. ఆల్వా ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదంటూ కినుక వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్కు దూరంగా ఉంది. అయితే సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి ఓటు వేశారు. 34 మంది టీఎంసీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయారు.
కాగా, ఉదయం నుంచి జరిగిన ఓటింగ్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, నితిన్ గడ్కరి, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, గజేంద్ర సింగ్ షెఖావత్, అర్జున్ రాం మెఘ్వాల్, వి.మురళీధరన్, జ్యోతిరాదిత్య సింధియా,రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ హేమమాలిని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీలు శశిథరూర్, జైరాం రమేష్, అధీర్ రంజన్ చౌదరి, ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.