కర్షక కవికి ఉపరాష్ట్రపతి అక్షరాంజలి
ABN , First Publish Date - 2020-11-09T15:55:16+05:30 IST
‘కర్షక కవి’ దువ్వూరి రామిరెడ్డి 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.
న్యూఢిల్లీ: ‘కర్షక కవి’ దువ్వూరి రామిరెడ్డి 125వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. స్వాతంత్రోద్యమంలో రామిరెడ్డి పోషించిన పాత్రను.. తన అక్షరాలతో రైతు జీవితాన్ని ఆయన వర్ణించిన తీరును స్మరించుకున్నారు.
‘‘అభ్యుదయ భావ కవితా కృషీవలుడు, సింహపురి సిరి శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి 125వ జయంతి సందర్భంగా ఆ కవికోకిల స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ‘కృషీవలుడు’ కావ్యం ద్వారా శ్రమజీవియైన రైతు జీవితం కూడా కవితావస్తువేనని నిరూపించిన కర్షక కవి ఆయన. స్వయంకృషితో అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన శ్రీ దువ్వూరి రామిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో రచించిన ‘మాతృశతకం’లోని ప్రతి పద్యం అగ్నిశిఖను తలపించింది. బ్రిటీష్ వారు ఆ పుస్తక ముద్రణను అడ్డుకునేంతగా ప్రజలను ప్రభావితం చేసింది’’ అని ట్వీట్ చేశారు.