వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం

ABN , First Publish Date - 2021-10-14T06:34:10+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 9న వెంకయ్య..

వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం

బీజింగ్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 13: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 9న వెంకయ్య అరుణాచల్‌లో పర్యటించి, రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే.. అది తమ భూభాగమని, అరుణాచల్‌ను తాము రాష్ట్రంగా గుర్తించలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్‌ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘‘సరిహద్దు సమస్యల పట్ల మా వైఖరి స్పష్టంగా ఉంది. ఆ అరుణాచల్‌ ప్రదేశ్‌ అనే ప్రాంతాన్ని చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. భారత్‌ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి భారత నేత పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చైనా అభ్యంతరాలను భారత్‌ గౌరవించాలి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలను దెబ్బతీసే పనులను మానుకోవాలి. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొనేందుకు అవసరమైన బలమైన చర్యలను భారత్‌ తీసుకోవాలి’’ అని లిజియన్‌ పేర్కొన్నారు. చైనా అభ్యంతరాలను భారత్‌ వ్యతిరేకించింది. 


ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మీడియా సమావేశంలో స్పందించారు. ‘‘భారత నేతలు భారత్‌లో ఏ రాష్ట్రంలోనైనా పర్యటిస్తారు. దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడమేంటనేది భారత ప్రజలకు అర్థం కాని విషయం. తాజాగా చైనా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో విడదీయలేని అంతర్భాగం. మేం గతంలోనే చెప్పినట్లు.. చైనా ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు యత్నించడం వలనే సరిహద్దు వివాదాలు ఏర్పడ్డాయి. అందువల్ల చైనా ఈ విషయంలో పరిష్కారం కోసం కృషి చేసి, ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవించాలని మేం సూచిస్తున్నాం’’ అని అరిందం తేల్చి చెప్పారు.


Updated Date - 2021-10-14T06:34:10+05:30 IST