సభా కార్యకలాపాల తీరుపై ఉప రాష్ట్రపతి ఆవేదన

ABN , First Publish Date - 2021-08-19T01:00:27+05:30 IST

పార్లమెంటు, శాసన సభల్లో కార్యకలాపాలకు అంతరాయాలు కలుగుతున్న

సభా కార్యకలాపాల తీరుపై ఉప రాష్ట్రపతి ఆవేదన

బెంగళూరు : పార్లమెంటు, శాసన సభల్లో కార్యకలాపాలకు అంతరాయాలు కలుగుతున్న తీరుపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ప్రమాణాలను పెంచడంలో చట్ట సభల సభ్యులు ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. యువ తరానికి ఓ ఉదాహరణగా మెలగాలని పిలుపునిచ్చారు.


బెంగళూరులోని ఎంఎస్ రామయ్య గ్రూప్ సంస్థల చైర్మన్ ఎంఆర్ జయరామ్‌కు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసిన అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. పార్లమెంటుతోపాటు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల శాసన సభలలో పరిస్థితులు దిగజారిపోవడం చూసి తాను చాలా విచారిస్తున్నానని తెలిపారు. ఇటీవల పార్లమెంటులో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ, కొందరు సభ్యుల చెడు ప్రవర్తన తనను బాధించిందన్నారు. 


వర్షాకాల సమావేశాల చివరి రోజు రాజ్యసభలో ఇన్సూరెన్స్ బిజినెస్ బిల్లును ప్రవేశపెట్టినపుడు మునుపెన్నడూ లేని విధంగా గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. పార్లమెంటు, శాసన సభల లక్ష్యం చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడమని, అంతరాయాలు కలిగించడం కాదని వెంకయ్య నాయుడు చెప్పారు. అసమ్మతిని వ్యక్తం చేసేటపుడు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాలన్నారు. భౌతికంగా ఎవరినీ ఇతరులు నిర్బంధించకూడదన్నారు. చర్చల నాణ్యతను మెరుగుపరచాలని చట్ట సభల సభ్యులను కోరారు. భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-08-19T01:00:27+05:30 IST