వేటకథల జగన్‌ కన్నుమూత..

ABN , First Publish Date - 2022-05-17T12:23:22+05:30 IST

‘వేట కథలు’ రచయిత దేవపట్ల జగన్‌ (74) సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు.

వేటకథల జగన్‌ కన్నుమూత..

తిరుపతి : ‘వేట కథలు’ రచయిత దేవపట్ల జగన్‌ (74) సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన తిరుపతి (Tirupati ) రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయంత్రం గోవిందధామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన జీవితంలో ఎక్కువభాగం శేషాచల అడవుల్లోనే గడిపిన జగన్‌ ఆ అనుభవాలతో ఆయన వేటకథలు రాశారు. రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, భూమన్‌ ముందు మాటలతో ఆ పుస్తకం ముద్రణలో ఉంది. రచయితలందరి సమక్షంలో పుస్తక ఆవిష్కరణ జరగాలని కోరుకుంటూ ఉండగానే ఆయన చనిపోయారు.  దేవపట్ల కొండారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఏడో సంతానమైన జగన్‌.. అక్క కుమార్తె శ్రీదేవిని వివాహమాడారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన మిత్రులైన నాయని కృష్ణమూర్తి, మౌనిలతో కలిసి జగన్‌ రాసిన కథల పుస్తకం ‘త్రయంబకం’ పేరుతో వెలువడింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 


రచయితల సంతాపాలు..

‘నా వేటగాడి కథల్ని తెలుగు భాషోద్యమ సమితి బాధ్యత తీసుకుని ప్రచురించాలి’ అని వారం క్రితమే తనకు చెప్పారని రచయిత సాకం నాగరాజ ఈసందర్భంగా గుర్తుచేసుకుని చింతించారు. తెలుగు భాషాపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే జగన్‌ మరణం దురదృష్టకరమని ఉమ్మడి చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య సమన్వయకర్త పలమనేరు బాలాజీ, అరసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంటా మోహన్‌, యువశ్రీ మురళి, రచయితలు పేరూరు బాలసుబ్రమణ్యం, వాకా ప్రసాద్‌, నాదెండ్ల శ్రీమన్నారాయణ, నెమిలేటి కిట్టన్న తదితరులు సంతాపాలు తెలిపినవారిలో ఉన్నారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటని దామోదరం, గంగవరం శ్రీదేవి విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-17T12:23:22+05:30 IST