నిర్ణయం మార్చుకున్నందుకు గర్విస్తున్నా: సుప్రియో

ABN , First Publish Date - 2021-09-18T23:35:38+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడం మహదవకాశంగా భావిస్తున్నానని, ఆ పార్టీతో కలిసి..

నిర్ణయం మార్చుకున్నందుకు గర్విస్తున్నా: సుప్రియో

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడం మహదవకాశంగా భావిస్తున్నానని, ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానని బీజేపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. బెంగాల్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు బీజేపీకి రాజీనామా చేసిన ఆయన శనివారంనాడు టీఎంసీలో చేరారు. తన చేరికపై మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలను విడిచిపెడుతున్నట్టు ఇటీవల తాను మనస్ఫూర్తిగానే ప్రకటించానని చెప్పారు. అయితే టీఎంసీ రూపంలో బెంగాల్ ప్రజలకు సేవ చేసే మహదవకాశం వచ్చిందన్నారు. రాజకీయాలను వదిలిపెడతానని అన్నప్పుడు తన మిత్రులంతా ఆ నిర్ణయం తప్పని, భావోద్వేగంతో తీసుకున్నదని చెప్పారని బాబుల్ సుప్రియో వివరించారు. దీంతో నిర్ణయం మార్చుకున్నానని, అందుకు గర్విస్తున్నానని చెప్పారు. బెంగాల్ ప్రజలకు సేవ చేసే మహదవకాశం కోసమే మళ్లీ వెనక్కి (రాజకీయాల్లోకి) వచ్చానని అన్నారు. దీదీని (ముఖ్యమంత్రి మమతాబెనర్జీ) సోమవారంనాడు కలుసుకుంటానని చెప్పారు. ఎంతో ఆప్యాయంగా తనను టీఎంసీ అక్కున చేర్చుకోవడం మహదానందం కలిగించిందని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన అసోంసోల్‌ నియోజకవర్గానికి చేయగలిగినదంతా చేస్తామని సుప్రియో తెలిపారు.

Updated Date - 2021-09-18T23:35:38+05:30 IST