నీరు ఉన్నా..!

ABN , First Publish Date - 2020-08-08T09:57:04+05:30 IST

డోన్‌ మండలంలోని వెంకటాపురం-అబ్బిరెడ్డిపల్లె చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండింది.

నీరు ఉన్నా..!

నిండిన వెంకటాపురం-అబ్బిరెడ్డిపల్లె చెరువు 

అయినా ఆయకట్టు రైతులకు నిరాశ

నీటి విడుదలకు అడ్డుకొంటున్న వైనం

తీవ్ర నిరాశకు గురవుతున్న రైతులు


డోన్‌, ఆగస్టు 7: డోన్‌ మండలంలోని వెంకటాపురం-అబ్బిరెడ్డిపల్లె చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండింది. ఏళ్ల తర్వాత చెరువు పూర్తిగా నిండటంతో ఆయకట్టు రైతులు సంబరపడిపోయారు. కానీ చెరువు నుంచి నీరు విడుదల చేయకుండా కొందరు అడ్డుపడుతున్నారు. కళ్లెదుటే నీరున్నా సాగు చేసేందుకు వీల్లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డోన్‌ మండలం వెంకటాపురం-అబిరెడ్డిపల్లె చెరువు జిల్లాలోనే పెద్దది. దాదాపు 1740 ఎకరాల ఆయకట్టు ఉంది. పరోక్షంగా మరో 800 ఎకరాలకు నీరు అందుతుంది.


15 గ్రామాలకు చెందిన 2 వేల మంది రైతులకు చెరువు కింద పొలాలు ఉన్నాయి. 2005 తర్వాత మళ్లీ 2017లో చెరువు నిండింది. 24 అడుగుల పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. కాల్వలకు నీరు వదిలితే దుక్కి, దున్ని నారు పోసుకునే వీలుంటుంది. ముఖ్యంగా ఈ పొలాల్లో సోనా మసూరి సాగు చేస్తారు. అయితే ఓ గ్రామానికి చెందిన కొందరు ఖరీఫ్‌లో నీరు వదలకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పంటలు పండించకుండా డిసెంబరులో నీరు విడుదల చేయాలని కొందరు వాదించడం ఏమిటని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


నీరు  వెంటనే విడుదల చేయాలి: పెద్ద బాలయ్య, వెంకటాపురం రైతు


చెరువు కింద నాకు అరెకరా ఉంది. చెరువు నిండటంతో వరి పండించుకోవచ్చని ఆశగా ఉన్నా. కానీ నీరు వదలడం లేదు. వెంటనే కాల్వలకు నీటిని విడుదల చేయాలి. 


చెరువు నీరు ఉండేది ఎందుకు?: పాపన్న, వెంకటాపురం రైతు

చెరువు కింద అరెకరా ఉంది. నీరు నిండినా ఇంతవరకు కాల్వలకు నీరు వదలలేదు. చెరువులో నీరు ఉండేదెందుకో అర్థం కావడం లేదు.  


రైతుల అభిప్రాయం మేరకే నీటి విడుదల: విద్యాసాగర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ డీఈ, డోన్‌


ఆయకట్టు రైతులు సాగు చేసుకోవడానికి నీరు వదలాల్సిందే. అయితే వెంకటాపురం-అబిరెడ్డిపల్లె చెరువు నీటి విడుదల విషయంలో కొంత వివాదం నెలకొంది. రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నాం. 


Updated Date - 2020-08-08T09:57:04+05:30 IST