ఆశా వర్కర్ బదిలీ వ్యవహారంలో రాజకీయ మలుపు
ABN , First Publish Date - 2021-04-21T06:11:32+05:30 IST
49వ డివిజన్ ఆశా వర్కర్ బదిలీ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ప్రైజర్పేట ప్రాంతంలో అప్పటికప్పుడు అర్ధాతరంగా బదిలీ చేసి కొత్త వారిని నియమించడంపై వివాదం చోటచేసుకుంది.
టీడీపీ సానుభూతిపరుడికుటుంబంపై ఆశా వర్కర్ ఫిర్యాదు
ఉదయం నుంచి రాత్రి వరకుస్టేషన్లోనే కూర్చోబెట్టిన పోలీసులు
సంతకాలు పెట్టినా బలవంతంగా స్టేషన్లో కూర్చోబెట్టారని టీడీపీ సానుభూతిపరుడి ఆవేదన
చిట్టినగర్, ఏప్రిల్ 20:
49వ డివిజన్ ఆశా వర్కర్ బదిలీ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ప్రైజర్పేట ప్రాంతంలో అప్పటికప్పుడు అర్ధాతరంగా బదిలీ చేసి కొత్త వారిని నియమించడంపై వివాదం చోటచేసుకుంది. ప్రైజర్పేట వెంకటనారాయణ (దేవదానం) టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆయన కోడలు నీలం ఝాన్సీరాణి, కూమార్తె మధులత, మరదలు సుజాత.. 49వ డివిజన్లోనే సచివాలయాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నారు. వెంకటనారాయణ కొడలు ఝాన్సీరాణి పనిచేసే ప్రాంతంలో అదే డివిజన్లో పనిచేసే అగస్టీన్ రాణికి హెల్త్ అధికారి విధులు అప్పగించారు. అగస్టీన్ రాణి సోమవారం గర్భిణులకు కిట్లు ఇచ్చేందుకు వెళ్లగా వెంకట నారాయణ, ఆయన భార్య కుమారి, ఆశావర్కర్లుగా పనిచేసే సుజాత, ఝాన్సీరాణి, మధులత వెంకటనారాయణ చిన్న కుమారుడు... తనను అడ్డగించి చేతులతో కొట్టి నీ హంతుచూస్తామని బెదిరించారని అగస్టీన్ రాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకట నారాయణ ఆయన భార్య, కుమారుడు ముగ్గురు ఆశా వర్కర్లను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్పై వదిలేశారు. మళ్లీ ఏం జరిగిందో హఠాత్తుగా పోలీసులు తన కుటుంబాన్ని మళ్లీ స్టేషన్లో కూర్చోబెట్టారు. దీనిపై వెంకటనారాయణ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు మాత్రం 41 సీఆర్పీ నోటీస్ తీసుకోవడానికి నిరాకరించడం వల్లే స్టేషన్లో కూర్చోబెట్టామని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ స్థానిక నాయకులు స్టేషన్కు వచ్చారు.
ఆత్మహత్య చేసుకుంటా : బాధితుడు
టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీ చేయటమే తన తప్పా అని, మంత్రి ఆదేశాలతో కావాలని పోలీసుల తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, వేధింపులు ఇలాగే కొనసాగిస్తే తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు వెంకట నారాయణ హెచ్చరించాడు. తమకు ఎలాంటి నోటీసూ ఇవ్వలే లేదని, పోలీసులు కావాలని అలా చెబుతున్నారనీ అన్నాడు. వదిలేసి గంట తరువాత మళ్లీ సీఐగా తమను స్టేషన్లో కూర్చొబెట్టామన్నారని ఉదయం నుంచి రాత్రి వరకు ఉంచారని, తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని బతిమాలినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. మంత్రి చెప్పారనే తనను కూర్చోబెట్టారని, 46వ డివిజన్ చెందిన వైసీపీ నాయకుడి రెండో భార్య ఇంట్లో పని చేసే ఆశా వర్కర్ను కావాలని అతని సిఫార్సు మేరకు బదిలీ చేశాడని బాధితుడు ఆరోపించాడు.
నోటీస్ తీసుకోకపోవడం వల్లే : పోలీసులు
కేసు నమోదు చేసిన తరువాత 41 సీఆర్పీ ప్రకారం నోటీస్ జారీ చేస్తామనీ, నోటీసుల తీసుకోకపోవడం వల్లే వెంకటనారాయణను, ఆయన కుటుంబాన్ని స్టేషన్లో కూర్చో బెట్టాల్సి వచ్చిందనీ, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని కెవి మోహన్రెడ్డి అన్నారు.