నూతన విద్యా విధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి దార్శనిక పత్రం: వెంకయ్య

ABN , First Publish Date - 2020-08-07T04:14:30+05:30 IST

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు...

నూతన విద్యా విధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి దార్శనిక పత్రం: వెంకయ్య

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. రాజలక్ష్మి పార్థసారథి మొదటి స్మారకోపన్యాసంలో ఆన్ లైన్ వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. నూతన విద్యా విధానం విద్యార్థి సమగ్రాభివృద్ధికి లక్షించిన ఓ దార్శనిక పత్రమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. విద్యార్థి కేంద్రిత నూతన విధానం ద్వారా పోటీ ప్రపంచానికి అనుగుణంగా భవిష్యత్ భారతదేశాన్ని సిద్ధం చేసేందుకు వీలవుతుందని చెప్పారు. పాఠ్యప్రణాళికలో తీసుకురానున్న మార్పులతో విద్యార్థులపై భారం తగ్గుతుందన్నారు. విద్యార్థుల్లో బాల్యం నుంచే చదువులతోపాటు ఆటపాటలు, శారీరక శ్రమపైనా సమాన దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. విద్యార్థులు కూడా తరగతి గదులతో సమానంగా క్రీడా మైదానాల్లో సమయం గడపాలన్నారు.


వెంకయ్యనాయుడు ఇంకా మాట్లాడుతూ  ‘‘ నూతన విద్యావిధానం భారతదేశ మూల విధానాలను.. ఆధునిక ప్రపంచంలోని ఉత్తమమైన ఆలోచనలను సమన్వయం చేస్తుంది. దీంతోపాటుగా మాతృభాషకు సరైన గుర్తింపునివ్వడం ద్వారా భారతీయ భాషల ప్రాముఖ్యతను కాపాడుకోవడంతోపాటు ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భారతీయ భాషలను బలవంతంగా ఎవరిపైనా రుద్దకూడదు. అలాగని వీటిని వ్యతిరేకించడం కూడా సరికాదు. బాల్యం నుంచే తరగతి గదుల్లో విద్యను నేర్పించడంతోపాటు ప్రయోగశాలల్లో వినూత్న ఆలోచనలకు బీజం పడేలా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు జాతీయవాదాన్ని, నైతిక విద్యను, భారతీయ కళలను, సాంస్కృతిక వారసత్వాన్ని చిన్నప్పటినుంచే నేర్పించాలి.’’ అని అన్నారు. 


‘భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ఆత్మ’ అన్న సుబ్రమణ్య భారతి రచించిన పద్యాన్ని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యాపాఠ్యప్రణాళికలో వచ్చిన అవాంఛిత మార్పులను ఈ సందర్భంగా వెంకయ్య ప్రస్తావించారు. ఆన్ లైన్ పద్ధతిలో విద్యాబోధన తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనన్నారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలకు ఇవి ప్రత్యామ్నాయం కాబోవని వెంకయ్య అభిప్రాయపడ్డారు.


శ్రీమతి వైజీపీగా సుపరిచితురాలైన డాక్టర్ రాజలక్ష్మి పార్థసారథి బహుముఖ ప్రజ్ఞశాలి అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పద్మ శేషాద్రి బాల భవన్ పాఠశాలలను స్థాపించి.. జాతీయవాదాన్ని విద్యార్థులకు బోధించాలన్న వారి అంకితభావాన్ని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.


Updated Date - 2020-08-07T04:14:30+05:30 IST