భారత ఉపరాష్ట్రపతి ఖతర్ పర్యటన.. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఎన్నారైలు!
ABN , First Publish Date - 2022-05-27T02:57:34+05:30 IST
త్వరలో ఖతర్ పర్యటనకు రానున్న ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడుకు ఘనంగా స్వాగతం పలికెందుకు తెలుగు ప్రవాసీయులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: త్వరలో ఖతర్ పర్యటనకు రానున్న ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడుకు ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగు ప్రవాసీయులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబసమేతంగా మోదటిసారిగా ఖతర్కు వస్తున్న ఆయనకు పూర్తి తెలుగు వాతవారణంలో స్వాగతం పలకాలని ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖతర్, భారత దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖతర్ ఉప అమీర్ (యువ రాజు) షేక్ అబ్దుల్లా బిన్ హామద్ అల్ తానీతో ఉపరాష్ట్ర పతి భేటీ కానున్నారు.
ఈ నెల 30 నుండి జూన్ 7 వరకు ఆయన చేయనున్న మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి మజిలిలో ఖతర్లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ మెరకు విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ఆఫ్రీకాలో గాబోన్, సెనగాల్ దేశాల పర్యటన అనంతరం ఉప రాష్ట్రపతి ఖతర్కు రానున్నారు. ఖతర్లోని వ్యాపారవేత్తలు, అధికారులతో పాటు ప్రవాస భారతీయులతో కూడా వెంకయ్య నాయుడు సమావేశమవుతారు. ఇక ఉపరాష్ట్రపతి వెంట బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు పార్లమెంటు సభ్యులు కూడా రానున్నారు.