Vemulawada శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-12-02T12:08:15+05:30 IST
దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం బుధవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు
రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం బుధవారం భక్తులతో రద్దీగా మారింది. కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి శ్రీస్వామివారిని దర్శించుకుని కోడెమొక్కు చెల్లించుకున్నారు. శ్రీస్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, అమ్మవారి కుంకుమపూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు.
అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయంలో భక్తులతో సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ నేతృత్వంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ శ్రీస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా, ఈవో కృష్ణప్రసాద్ ప్రసాదం అందజేశారు. డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి శ్రీస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.