రాజన్న క్షేత్రం.. భక్త జన సంద్రం

ABN , First Publish Date - 2022-02-22T02:34:01+05:30 IST

భక్తుల కొంగుబంగారం, ఆదిదేవుడు రాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దివ్యక్షేత్రం సోమవారం

రాజన్న క్షేత్రం.. భక్త జన సంద్రం

వేములవాడ: భక్తుల కొంగుబంగారం, ఆదిదేవుడు రాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దివ్యక్షేత్రం సోమవారం భక్తజనంతో కిక్కిరిసింది. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వేములవాడకు తరలివచ్చారు. మేడారం సమ్మక్క సారక్క జాతర ముగియడంతో భక్తుల రద్దీ పెద్దగా ఉండకపోవచ్చని ఆలయ అధికారులు అంచనా వేసినప్పటికీ మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతుండడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులుదీరడంతో కోడె మొక్కుల క్యూలైన్‌ వీఐపీ పార్కింగ్‌ స్థలం వరకు సాగింది. లఘుదర్శనం అమలు చేసినప్పటికీ  స్వామివారి సర్వదర్శనానికి రెండు గంటలు, కోడెమొక్కు చెల్లింపునకు మూడు గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది.  దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-22T02:34:01+05:30 IST