వదిలేస్తే.. తుక్కుకే..!

ABN , First Publish Date - 2022-07-17T05:41:05+05:30 IST

సెబ్‌ స్టేషన్లలో సీజ్‌ చేసిన వందలాది వాహనాలు తుప్పు పడుపడుతున్నాయి. జిల్లాలో దాదాపు 815వాహనాలు ఇలా మూలనపడ్డాయి.

వదిలేస్తే.. తుక్కుకే..!
నరసరావుపేటలోని ఎస్‌ఈబీ స్టేషన్‌లో సీజ్‌ చేసిన వాహనాలు

సెబ్‌ స్టేషన్‌లలో వందలాది వహనాలు 

వేలం నిర్వహణలో జాప్యం

తుప్పుపడుతున్న వాహనాలు 

చోద్యం చూస్తున్న సెబ్‌ అధికారులు


నరసరావుపేట, జూలై 16: సెబ్‌ స్టేషన్లలో సీజ్‌ చేసిన వందలాది వాహనాలు తుప్పు పడుపడుతున్నాయి. జిల్లాలో దాదాపు 815వాహనాలు ఇలా మూలనపడ్డాయి. మద్యం, సారా, గంజాయి వంటి నిషేదిత వస్తువులు రవాణాకు వినియోగించే వాహనాలను సెబ్‌ సీజ్‌ చేసింది. వీటిని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ పోలీసు స్టేషన్లకు తరలించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు తదతర వాహనాలు వీటిలో ఉన్నాయి. నరసరావుపేట స్టేషన్‌లో 169, చిలకలూరిపేటలో 49, సత్తెనపల్లి 72, క్రోసూరు 31, పిడుగురాళ్ళ 94, గురజాల 130, మాచర్ల 122, వినుకొండ 59, ఈపూరు 56, పెదకూరపాడు స్టేషన్‌లో 33.. మొత్తం 815 వాహనాలు ఇలా పడి ఉన్నాయి. వీటిని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు వేలం వేయాలి. ఇందుకు ఉన్నతాధికారులు అనుమతులు అవసరం. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీంతో నెలల తరబడి వేలానికి నోచుకోకపోతుండటంతో అవి మట్టిపాలౌతున్నాయి. వీటిలో సామగ్రి కూడా పూర్తిగా పనికిరాకుండా పోతోంది. రవాణాశాఖ అధికారులు వాహనం విలువను నిర్ధారించాల్సి ఉంది. ఈ విలువ ఆధారంగా వేలం నిర్వహించాలి. ఇటీవల నాలుగు వాహనాలకు వేలం నిర్వహించగా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని సదరు ఉద్యోగులే చెబుతున్నాయి.  పూర్తిగా పాడయ్యాక వేలం నిర్వహిస్తే ఇటువంటి పరిస్థితులే తలెత్తుతాయి. సకాలంలో వేలం నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. ఈ దిశగా చర్యలు ఉండటంలేదు. దీంతో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది. ఇటీవలే కొన్ని వాహనాలను వేలం నిర్వహించామని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ఈఎస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి శనివారం తెలిపారు. ఉన్న వాహనాలను వేలం నిర్వహిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 


 

Updated Date - 2022-07-17T05:41:05+05:30 IST