ముంచేసిన కరోనా.. అసలేం జరిగిందో తెలిస్తే...

ABN , First Publish Date - 2020-03-27T03:26:23+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో ఢిల్లీలోని...

ముంచేసిన కరోనా.. అసలేం జరిగిందో తెలిస్తే...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో ఢిల్లీలోని ఆజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌లో టన్నుల కొద్దీ కూరగాయాలు కుళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ మార్కెట్ దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లలో ఒకటి. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. దీంతో.. ఆజాద్‌పూర్ మార్కెట్‌కు వచ్చి కొనుగోలు చేసే రిటైలర్లు, దుకాణదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాదాపు 70 ట్రక్కుల్లో ఉన్న 15 టన్నుల కూరగాయలు కుళ్లిపోయినట్లు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ సభ్యుడు అనిల్ మల్హోత్రా తెలిపారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడం కూడా ఇందుకు మరో కారణమని ఆయన వెల్లడించారు. హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చేందుకు కొనుగోలుదారులకు పోలీసులు అనుమతినివ్వడం లేదని మల్హోత్రా చెప్పారు. 


నిత్యావసరాలు సరఫరా చేసేందుకు తరలివెళ్లే ట్రక్కులను పోలీసులు అడ్డుకోవద్దని మార్కెట్‌లోని ఓ వ్యాపారి కోరారు. ప్రధాని మోదీ అత్యవసర సేవలకు మినహాయింపును ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కొనుగోలుదారులు లేకపోవడం, రవాణా చేసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పెద్ద మొత్తంలో పాడైపోయిన కూరగాయలను, పండ్లను డంపింగ్ యార్డులకు తరలించినట్లు ఓ వ్యాపారి తెలిపారు. నోయిడా, గురుగ్రామ్‌లో వినియోగదారులకు పాలు, పండ్లు చేరే అవకాశం లేకపోవడంతో 15వేల లీటర్ల పాలను, 10వేల కిలోల తాజా పండ్లను పారవేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ మిల్క్ బాస్కెట్ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2020-03-27T03:26:23+05:30 IST