మండుతున్న కూరగాయలు
ABN , First Publish Date - 2021-10-20T04:52:10+05:30 IST
కూరగాయల ధరలు ఒక్కసారిగా భగ్గుముంటున్నాయి. మండువేసవిలో పెరిగిన స్థాయికన్నా ప్రస్తుతం ధరలు మండుతున్నాయి.
భారీగా తగ్గిన దిగుబడులు, ఇతర ప్రాంతాల నుంచి రవాణా
డీజల్ ధరల పెరుగుదల కూడా కారణం
పక్షంరోజుల్లో అన్నింటిపై కిలోకు 50శాతం పెరుగుదల
ఒంగోలు(కలెక్టరేట్), అక్టోబరు 19 : కూరగాయల ధరలు ఒక్కసారిగా భగ్గుముంటున్నాయి. మండువేసవిలో పెరిగిన స్థాయికన్నా ప్రస్తుతం ధరలు మండుతున్నాయి. పక్షంరోజుల్లో అన్నిరకాల కూరగాయలపై 50శాతానికిపైగా రేట్లు పెరిగాయి. జిల్లాలో ఈ ఏడాది సాగు గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకొకవైపు రోజువారీ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఆ ప్రభావం కూడా రవాణాపై పడింది. కూరగాయల ధరలు పెరగడానికి అదీ ఒక కారణమైంది. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు మండిపోతాయి. అటువంటిది ప్రస్తుత అనుకూలమైన సీజన్లో కూడా వేసవి కంటే ధ రలు అధికంగా ఉండటంతో సామాన్యులు కొని తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మిర్చి, క్యారెట్, టమోటా వంటివి ధరల్లో కొంతమేర హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. కానీ ప్రస్తుతం అన్నిరకాల కూరగాయల ధరలు కిలో రూ.30కిపైనే ఉంటున్నాయి. క్యారెట్, పెద్ద చిక్కుళ్ళు కిలో రూ.80 పలుకుతుండగా కాకర, బీర, క్యాప్సికమ్, బీన్స్ వంటివి కిలో రూ.50 పలుకుతున్నాయి. మిగిలినవి కిలో రూ.25 నుంచి రూ.40 వరకు ఉంటున్నాయి. ఆకు కూరలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. నిన్నా మొన్నటి వరకు మూడు కట్టలు రూ.10 ఉండగా ప్రస్తుతం ఒక్కొక్క కట్ట రూ.10 పలుకుతోంది. ఒంగోలు మార్కెట్లో మంగళవారం ఉన్న కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
కూరగాయల రకం కిలో ధర
క్యారెట్ 80.00
పెద్దచిక్కుళ్ళు 80.00
క్యాప్షమ్ 60.00
పచ్చిమిర్చి 55.00
బీర 55.00
కాకర 50.00
బీన్స్ 50.00
టమోట 40.00
బీట్రూట్ 40.00
వంకాయ 40.00
దొండ 30.00
కీరదోశ 30.00
బెండ 30.00
చామదుంప 30.00
బంగాళదుంప 25.00
దోస 20.00
గోరుచిక్కుళ్లు 20.00
మునక్కాయలు(కిలో) 90.00