వేదగిరీశుడికి వెండి పంచపాత్ర, కాసులదండ బహూకరణ
ABN , First Publish Date - 2022-05-29T03:55:55+05:30 IST
వేదగిరి క్షేత్రంలో కొలువైన ఆదిలక్ష్మి సమేత లక్ష్మీనరసింహ స్వామికి పలువురు దాతలు శనివారం వెండి పంచపాత్ర, కాసుల దండ బహూకరించారు.
నెల్లూరురూరల్, మే 28 : వేదగిరి క్షేత్రంలో కొలువైన ఆదిలక్ష్మి సమేత లక్ష్మీనరసింహ స్వామికి పలువురు దాతలు శనివారం వెండి పంచపాత్ర, కాసుల దండ బహూకరించారు. నెల్లూరుకు చెందిన నరసింహ లీలాకృష్ణ, హరిత దంపతులు కేజీ వెండితో తయారు చేయించిన పంచపాత్రలోని ఉప పాత్రను వేదగిరిక్షేత్రంలో ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, ఈవో గిరికృష్ణలకు అందజేశారు. ఈ పాత్ర నిత్యం స్వామి వార్లకు తిరువారాధన కైంకర్యములకు ఉపయోగించే పంచపాత్రలలో ఉపపాత్రగా వాడనున్నామని ఆలయన ప్రధాన అర్చకుడు తెలిపారు. అలాగే విడవలూరు మండలం అలగానిపాడు గ్రామానికి చెందిన పాపని నరసింహకుమార్ దంపతులు రూ.50 వేల విలువైన కాసుల దండను ప్రధాన అర్చకుడు భాస్కరాచార్యుల సమక్షంలో ఆలయ చైర్మన్, ఈవోలకు అందజేశారు. అనంతరం దాతలను వారు అభినందించారు. స్వామి, అమ్మవార్ల సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.