ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన వరుణ్ గాంధీ

ABN , First Publish Date - 2021-10-23T21:40:23+05:30 IST

అన్నదాతలు తాము పండించిన పంటలను తామే కాల్చవలసిన

ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన వరుణ్ గాంధీ

లక్నో : అన్నదాతలు తాము పండించిన పంటలను తామే కాల్చవలసిన పరిస్థితులు వస్తున్నాయని, ప్రభుత్వం తన వ్యవసాయ విధానాలపై పునరాలోచించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. కొనేవారు లేకపోవడంతో సమోధ్ సింగ్ అనే రైతన్న తాను పండించిన ధాన్యానికి తానే నిప్పు పెట్టినట్లు కనిపిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. రైతన్నల దుస్థితిపై ప్రభుత్వాన్ని  నిలదీశారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిబిత్ లోక్‌సభ సభ్యుడు వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా శనివారం ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతన్నలను ఈ వ్యవస్థ ఎక్కడికి తీసుకెళ్ళిందని ప్రశ్నించారు. సమోధ్ సింగ్ అనే రైతు తాను పండించిన ధాన్యాన్ని  అమ్ముకోవడానికి ఒక మండీ నుంచి మరొక మండీకి 15 రోజుల నుంచి తిరుగుతున్నారని, ఎవరూ ఆ ధాన్యాన్ని కొనకపోవడంతో, తీవ్ర నైరాశ్యంతో ఆ ధాన్యానికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. ఆయన సమీపంలో ఉన్నవారు ఆయనను ఎంతగా వారించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. వ్యవసాయ విధానాలను ప్రభుత్వం పునరాలోచించడం ప్రస్తుత అవసరమని తెలిపారు. 


వరుణ్ గాంధీ ఇటీవల బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. లఖింపూర్ ఖేరీ ఘటనను హిందూ వర్సెస్ సిక్కు యుద్ధంగా మలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న రైతులను ఖలిస్థానీలని ఆరోపించడం సరికాదని చెప్పారు. దీనివల్ల దేశ సమైక్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఈ నెల 3న కొందరు రైతులు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ రైతులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేశారు. 


Updated Date - 2021-10-23T21:40:23+05:30 IST