ఇన్‌చార్జ్‌లే దిక్కు! పాలన సాగేదెలా?

ABN , First Publish Date - 2022-04-30T04:27:21+05:30 IST

అసలే జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్న శివారు మండలం. అందులోనూ ప్రధాన కార్యాలయాలకు అధికారుల కరువు.

ఇన్‌చార్జ్‌లే దిక్కు!  పాలన సాగేదెలా?
హౌసింగ్‌ కార్యాలయం

ప్రజలకు తప్పని ఇక్కట్లు

వరికుంటపాడు, ఏప్రిల్‌ 29: అసలే జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉన్న శివారు మండలం. అందులోనూ ప్రధాన కార్యాలయాలకు అధికారుల కరువు. ఉన్న వారు సైతం అంతంతమాత్రంగానే విధులకు హాజరు. ఇక ప్రజలకు ఎంతమేర ప్రభుత్వ సేవలు అందుతున్నాయో ఉన్నతాధికారులకే ఎరుక. మారుమూల వరికుంటపాడు మండలానికి సంబంధించి ఏళ్ల తరబడి ప్రధాన కార్యాలయాలకు రెగ్యులర్‌ అధికారులు లేకపోవడంతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూరా ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని కార్యాలయాల్లో కనీస సమాచారం చెప్పే నాథులు కూడా కరువవడంతో తమ గోడు ఎవరికి చెప్పాలో తెయని అయోమయ పరిస్థితుల్లో పలు గ్రామాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి, పెద్దిరెడ్డిపల్లి గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మండల కేంద్రంలో ఉండాల్సిన ఏఈ పోస్టు సుమారు ఏడేళ్లుగా ఖాళీగానే దర్శనమిస్తుంది. ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఏఈ కేవలం ఆరు నెలల్లోనే పదోన్నతిపై వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం మర్రిపాడు మండల ఏఈ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే హౌసింగ్‌ ఏఈ పోస్టు రెండేళ్లకు పైబడి ఖాళీగా ఉండగా సీతారామపురం ఏఈ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ కార్యాలయ తలుపులు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి. వ్యవసాయాధికారి పోస్టు సైతం రెండేళ్లుగా రెగ్యులర్‌ అధికారి కోసం ఎదురుచూస్తునే ఉంది. దుత్తలూరు మండల ఏవో ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వరికుంటపాడు పశువైద్యాధికారి డిప్యుటేషన్‌పై కడప జిల్లాకు వెళ్లడంతో ఆయన స్థానంలో దుత్తలూరు మండలం నర్రవాడ పశువైద్యాధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉపాధిహామీ కార్యాలయ ఏపీవో సెలవుపై వెళ్లడంతో ఉదయగిరి ఏపీవో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. గ్రంథాలయాధికారికి అదనంగా ఉదయగిరి, సీతారామపురం బాధ్యతలు అప్పగించడంతో వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. 24 పంచాయతీలు, 56 గ్రామాలు కలిగిన మండలంలో ఉన్నతాధికారుల తనిఖీలు ఉండవనే ధీమాతో ఇన్‌చార్జి అధికారులు తమకు కేటాయించిన కార్యాలయాల వైపు కన్నెత్తి చూడకపోవడం ఒకవంతైతే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సైతం అడిగేవారు లేరులే అన్న ధీమాతో ఆడిందే ఆట పాటిందే పాటగ వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలమైన సమయాల్లోనే కార్యాలయాలకు హాజరవుతుండడంతో ఎంతో వ్యయప్రయాసాలకోర్చి గ్రామాల నుంచి పరుగులు తీసిన ప్రజలకు నిరాశే మిగులుతుంది. సమాచారం అందించాలన్నా, ఫిర్యాదులు చేయాలన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగానే వెనుతిరగాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి పనులకు సైతం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూరా ప్రదక్షణలు చేస్తూ అధికారులు ఎప్పుడు వస్తారా అంటూ ప్రతినిత్యం ఆశగా ఎదురుచూడక తప్పడం లేదు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి మారుమూల వెనుకబడిన మండలానికి రెగ్యులర్‌ అధికారులను నియమించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-04-30T04:27:21+05:30 IST