వరవరరావును విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-05-31T08:37:32+05:30 IST

మహారాష్ట్ర జైల్లో తీవ్ర అస్వస్థతకు గురైన విరసం నేత వరవరరావును తక్షణమే బెయిల్‌ లేదా పెరోల్‌పై విడుదల చేయాలని ఆయన భార్య, కుటుంబ సభ్యులు శనివారం డిమాండ్‌ చేశారు.

వరవరరావును విడుదల చేయాలి

ఎన్‌ఐఏ కక్షపూరిత ధోరణిని వీడాలి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

భార్య, కుమార్తెల డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌ వర్క్‌): మహారాష్ట్ర జైల్లో తీవ్ర అస్వస్థతకు గురైన విరసం నేత వరవరరావును తక్షణమే బెయిల్‌ లేదా పెరోల్‌పై విడుదల చేయాలని ఆయన భార్య, కుటుంబ సభ్యులు శనివారం డిమాండ్‌ చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆయన సతీమణి హేమలత కోరారు. అబద్ధపు ఆరోపణలు చేసి, విచారణ లేకుండా 18 నెలలుగా వరవరరావు, ఇతర హక్కుల నేతలను జైల్లో నిర్బంధించారని ఎన్‌ఐఏ కక్షపూరిత ధోరణిని విడనాడాలని కేంద్ర హోంశాఖ ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. తెలుగువారైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు. వరవరరావుకు బెయిల్‌ వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అందువల్ల ఆయనను ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్లుగా తమకు చిక్కడపల్లి పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. వరవరరావును కలిసేందుకు కోర్టు అనుమతి దొరికితే ముంబైకి వెళ్తామని ఆమె చెప్పారు. కాగా, వరవరరావును తక్షణమే విడుదల చేయాలని ఆయన కుమార్తెలు అనల, పవన డిమాండ్‌ చేశారు. తమ తండ్రికి కొవిడ్‌ పరీక్షలు చేయగా, నెగెటివ్‌ వచ్చినట్లు తెలిసిందన్నారు. జైల్లో అస్వస్థతకు కారణాలపై వైద్య పరీక్షలు జరపాలని వారు కోరారు. '


లెఫ్ట్‌, పౌరహక్కుల నేతల విజ్ఞప్తి

వరవరరావుని వెంటనే విడుదల చేసి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స చేయించాలని 10 వామపక్షాలు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు విజ్ఞప్తి చేశాయి. శనివారం ఈమేరకు సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్‌)జాస్తి కిశోర్‌బాబు తదితరులు ప్రకటన చేశారు. ఏడాదిన్నరగా ఎలాంటి విచారణ జరపకుండా వరవరరావుని జైల్లో నిర్బంధించడం అత్యంత క్రూరమైన చర్య అని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆరోగ్యం క్షీణించిన వరవరరావు, ప్రొఫెసర్‌ సాయిబాబలను వారి స్వరాష్ట్రాలకు పంపించి చికిత్సకు అవకాశం కల్పించాలని పౌరహక్కు ల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) ఎన్డీ నేత కె.గోవర్ధన్‌, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుత రామారావు కోరారు. 

Updated Date - 2020-05-31T08:37:32+05:30 IST