రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది: అనిత

ABN , First Publish Date - 2022-01-25T17:57:03+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యిందని వంగలపూడి అనిత విమర్శించారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది: అనిత

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యిందని, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, తప్పుడు కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, కస్టోడియల్ వేధింపులు, చిత్రహింసలకు కేంద్రంగా మారిందని విమర్శించారు. తాజాగా ఉమామహేశ్వరి అనే దళిత మహిళపై చిత్తూరు పట్టణ పోలీసుల కస్టోడియల్ వేధింపులే ఇందుకు నిదర్శనమన్నారు. చేయని దొంగతనాన్ని ఆమెపై వేసి రెండు రోజులపాటు స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారన్నారు.


బాధిత మహిళ ఉమామహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తోందని, వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రూ. 2 లక్షలు పోయాయని, చేయని దొంగతనాన్ని అంగీకరించమని దళిత మహిళ ఉమామహేశ్వరిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని అనిత అన్నారు. తర్వాత ఆ డబ్బు వేణుగోపాల్ రెడ్డికి తెలిసిన వారే తీసుకున్నట్లు తెలిందని, ఆ విషయం తెలిసి కూడా ఉమామహేశ్వరిని పోలీస్ స్టేషన్‌లో హింసించారన్నారు. పోలీసులు మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా విస్మరించారన్నారు. అంతేకాదు అరెస్టులు, కస్టోడియల్ చిత్రహింసలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను కూడా పూర్తిగా విస్మరించారన్నారు. ఈ  ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసినట్లు అనిత చెప్పారు.

Updated Date - 2022-01-25T17:57:03+05:30 IST