వండలూరు జూలో 80 మంది సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2022-01-16T21:36:37+05:30 IST

వండలూరు జూగా పేరుగాంచిన అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్‌లో 80 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు

వండలూరు జూలో 80 మంది సిబ్బందికి కరోనా

చెన్నై: వండలూరు జూగా పేరుగాంచిన అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్‌లో 80 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో తమ సిబ్బందికి కూడా ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్టు జూ డైరెక్టర్ వి.కరుణప్రియ తెలిపారు. శనివారం అందిన పరీక్ష ఫలితాల్లో 80 మంది సిబ్బందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. బాధితుల్లో ఎవరికీ లక్షణాలు లేవని, చికిత్స కొనసాగుతోందని తెలిపారు. 


సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారినపడడంతో వండలూరు జూను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆ రోజున పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, శనివారం తమిళనాడులో 23,989 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది చనిపోయారు.


తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,15,948 చేరుకోగా,  36,967 మంది మరణించారు. ఒక్క చెన్నైలోనే నిన్న 8,989 కేసులు వెలుగుచూశాయి. కరోనా అణచివేతకు తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రతి రోజూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా, ప్రతి ఆదివారాల్లో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంది. 

Updated Date - 2022-01-16T21:36:37+05:30 IST