నర్సుల వ్యాన్, ఇటుకల ట్రాక్టర్ ఢీ
ABN , First Publish Date - 2021-07-28T05:26:41+05:30 IST
18 మంది నర్సులున్న వ్యాను జాతీయ రహదారిపై ఆసుపత్రివైపు తిరుగుతుండగా ఇటుకరాళ్ల ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో వ్యాన్ హైవేపై బోల్తాపడింది. ట్రాక్టర్ కూడా తిరగబడటంతో ఇటుకరాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వ్యాన్లోని నర్సులు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. స్థానిక యువకులు, వైద్యశాల సిబ్బంది హుటాహుటిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 18 మంది నర్సులకు చిన్నపాటి గాయాలయ్యాయి.
బోల్తాపడ్డ వాహనాలు
18 మంది నర్సులు, మరొకరికి గాయాలు
తప్పిన పెను ప్రమాదం
నెల్లూరు(క్రైం), జూలై 27: నెల్లూరు నగరంలో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిన చింతారెడ్డిపాళెం హైవే జంక్షన్పై సోమవారం మరో ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ట్రాఫిక్ పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు... మెడికవర్ వైద్యశాలలో పనిచేసే నర్సులు రోజూ షిప్టుల వారీగా హాస్టల్ నుంచి ఆసుపత్రికి వాహనంలో వస్తుంటారు. అదేవిధంగా మంగళవారం మధ్యాహ్నం 18 మంది నర్సులున్న వ్యాను జాతీయ రహదారిపై ఆసుపత్రివైపు తిరుగుతుండగా ఇటుకరాళ్ల ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో వ్యాన్ హైవేపై బోల్తాపడింది. ట్రాక్టర్ కూడా తిరగబడటంతో ఇటుకరాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వ్యాన్లోని నర్సులు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. స్థానిక యువకులు, వైద్యశాల సిబ్బంది హుటాహుటిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 18 మంది నర్సులకు చిన్నపాటి గాయాలయ్యాయి. వ్యాన్ బోల్తాపడ్డప్పుడు అటుపైపుగా పెద్ద వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యాన్ను ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ పరారుకాగా, ట్రాక్టర్ ట్రక్కుపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ డీఎస్పీ ఎండీ అబ్దుల్ సుబహాన్ ఘటనా స్థలానికి చేరుకుని ఇటుక రాళ్లను, వాహనాలను జాతీయ రహదారి నుంచి పక్కకు తీయించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అనంతరం వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్న నర్సుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.