వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దేవులపల్లి సాహితీ వైభవం
ABN , First Publish Date - 2021-02-25T01:05:10+05:30 IST
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి సాహితీ వైభవం అంతర్జాలం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి సాహితీ వైభవం అంతర్జాలం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్ ఇండియా వారు 11 దేశాలలోని సాహితీవేత్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, సింగపూర్, హాంగ్కాంగ్, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, దోహా-ఖతార్, అబుధాభీ దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవులపల్లి సాహితీ వైభవాన్ని కొనియాడారు. 1897 నవబంర్ 1న జన్మించిన దేవులపల్లి.. 1980 ఫిబ్రవరి 24 నిర్యాణం చెందారు. వంశీ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ, శిరోమణి, డా. వంశీ రామరాజు మాట్లాడుతూ ‘‘1978లో దేవులపల్లిని సత్కరించామని, ఆయన పేరుమీద కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వర్ణపతకాన్ని నెలకొల్పిన’’ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతర్జాలంలో ప్రసారమైన ఈ కార్యక్రమం రాత్రి 10 గంటలవరకు కొనసాగింది. రెండు గంటల సేపు దేవులపల్లి రచించిన లలిత గీతాలను వేదవతీ ప్రభాకర్, సురేఖామూర్తి, దివాకర్ల, శశికళాస్వామి వేదాల, హిమబిందు ఆలపించారు.
దేవులపల్లి మనుమరాలు రేవతి అడితం అమెరికా నుంచి మాట్లాడారు. ‘మా తాత మరణించి 4 దశాబ్దాలైనా వారిని స్మరిస్తూ 1978 నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంశీ సంస్థకు నా అభినందనలు’ అని అన్నారు. భారతదేశం నుంచి ప్రజానటి, కళాభారతి డా. జమునా రమణారావు, మండలి బుద్ధప్రసాద్, రేలంగి నరసింహారావు, సినీనటి పల్లవి, సినీ గేయరచయిత భువనచంద్ర, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా. వోలేటి పార్వతీశం, డా. దామరాజు కామేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా నుంచి రత్న(పాప)కుమార్, డా. చిట్టెన్రాజు వంగూరి, డా. శారదాపూర్ణ శొంఠి, రాధికా నోరి పాల్గొంటే.. డా. జొన్నలగెడ్డ మూర్తి(బ్రిటన్), సింగపూర్ నుంచి రత్నకుమార్ కవుటూరు, సుబ్బు వి. పాలకుర్తి పాల్గొన్నారు.
అలాగే జయ పీసపాటి(హాంగ్కాంగ్), ఆస్ట్రేలియా నుంచి సారథి మోటమర్రి, డా. యల్లాప్రెగడ రామకృష్ణారావు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి రాపోలు సీతారామరాజు, మలేషియా నుంచి సత్యమల్లుల, దుర్గప్రియా గొట్టాపు, మారిషస్ నుంచి సంజీవ నరసింహ అప్పడు, నరైన్ స్వామి సన్యాసి, ఖతార్ నుంచి తాతాజీ ఉసిరికల, కాళీబాబు దంటి, కల్యాణి కొండూరు, రామడుగు వేణుగోపాల, డా. వెంకట మాధవీలలిత జినుగు.. అబుధాభీ నుంచి చింతగుంట ఉదయపద్మ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ’ అనే ప్రార్థనాగీతాన్ని అనఘదత్త రామరాజు, దేవులపల్లి రచించిన ‘ఘనాఘన సుందర’ పాటను గుంటూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు వీణపై శ్రావ్యంగా వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, వంశీ మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వంశీ గ్లోబల్ అవార్డ్స్ బహూకరిస్తున్నట్లు తెలియజేశారు.