వలంటీర్ల సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2021-04-13T06:06:45+05:30 IST
ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో వలంటీర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు.
మంత్రి శంకరనారాయణ
పలువురు వలంటీర్లకు సేవా మిత్ర, రత్న, వజ్ర అవార్డులు ప్రదానం
అనంతపురం, ఏప్రిల్12(ఆంధ్రజ్యోతి) : ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో వలంటీర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన గ్రౌండ్లో అనంతపురం అర్బన నియోజకవర్గంలోని వలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు నిర్వహించారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ముందుగా అనంతపురం అర్బన పరిధిలోని 811 మంది వలంటీర్లకు సేవామిత్ర, 10 మందికి సేవారత్న, ఐదుగురికి సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో గొప్ప మార్పునకు నాంది పలికారన్నారు. వైఎస్ జగన తన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని వారి బాధలు తీరాలంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా వలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దిన నాయకుడు సీఎం జగన అన్నారు. ఈ నేపథ్యంలోనే వలంటీర్లకు గౌరవ పురస్కారం అందిస్తున్నారన్నారు. వారి పనితీరు ప్రామాణికంగా పురస్కారాలకు ఎంపిక చేసి అవార్డులు అందిస్తున్నామన్నారు. వలంటీర్లు సైతం ప్రభుత్వం నడుపుతున్న వారిలో భాగస్వాములవుతున్నారన్నారు. ఎవరైతే పురస్కారాలు అందుకున్నారో వారి మరింత సేవలను మెరుగుప రుచుకోవాలన్నారు. పురస్కారాలు అందని వలంటీర్లు పురస్కారాలు అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వలంటీర్ల సేవలు వెలకట్టలేవని వారందరికి తన తరఫున సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సేవామిత్ర పురస్కారాన్ని అందుకున్న వారిలో 16408 మంది, సేవారత్నకు 380 మంది, సేవా వజ్ర పురస్కారం కింద 70 మంది ఎంపికయ్యారన్నారు. ఈ పురస్కారం కింద వారందరికి రూ. 1.05 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నామన్నారు. వలంటీర్ల వ్యవస్థ తో దేశవ్యాప్తంగా రాష్ర్టానికి గుర్తింపు తీసుకురావడంలో వలంటీర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయ ర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఇనచార్జ్ ఆర్డీఓ మధుసూదన పాల్గొన్నారు.