దేశంలో 41 లక్షల మంది పిల్లలకు టీకాలు
ABN , First Publish Date - 2022-01-04T06:38:41+05:30 IST
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్
- ‘కొవిన్’లో మూడు రోజుల్లోనే 53 లక్షల మంది రిజిస్ట్రేషన్
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజున రికార్డు స్థాయిలో 41 లక్షల మందికిపైగా పిల్లలు టీకాలు వేయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట అయ్యే సరికే 12 లక్షల మంది బాలలు టీకాలు తీసుకున్నారు. ఇక టీకా కోసం కొవిన్ పోర్టల్లో 3 రోజుల్లోనే దాదాపు 53 లక్షల మందికిపైగా టీనేజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా టీకా వేసుకున్న టీనేజర్లకు అభినందనలు తెలిపారు.
‘‘భారత్ చేపడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీనేజర్లు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు విధిగా టీకాలు తీసుకోవాలి’’ అని పిలుపునిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ వారంలోగా 36 లక్షల మంది బాలలకు టీకా తొలి డోసు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుజరాత్లోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికార వర్గాలు ప్రకటించాయి. కాగా, జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.