వ్యాక్సిన్ విధానంపై రసాభాస!
ABN , First Publish Date - 2021-06-24T09:13:03+05:30 IST
ఢిల్లీలో బుధవారం జరిగిన శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం తీవ్ర రసాభాసకు దారితీసింది.
పార్లమెంటరీ కమిటీ భేటీలో బీజేపీ, విపక్షాల వాగ్యుద్ధం
న్యూఢిల్లీ, జూన్ 23: ఢిల్లీలో బుధవారం జరిగిన శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం తీవ్ర రసాభాసకు దారితీసింది. ఈ సమావేశంలో కొవిడ్ వ్యాక్సిన్ విధానంపై బీజేపీ, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగినట్లు తెలిసింది. వ్యాక్సిన్ విధానంపై చర్చ జరగనివ్వకుండా బీజేపీ సభ్యులు దాదాపు గంటసేపు అడ్డుకున్నారు. సమావేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధి, కొవిడ్ వేరియంట్లపై పరిశోధన గురించి చర్చించాల్సి ఉండగా, వ్యాక్సిన్లకు భిన్నమైన ధరల వివాదంపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించడం రాజకీయ వాగ్వాదానికి దారితీసింది.
అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయిన బీజేపీ ఎంపీలు కొద్దిసేపటికి తిరిగి వచ్చారు. తొలుత నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సమావేశం జరుగుతుందని అనంతరం కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వ్యాక్సిన్ కంపెనీలు అమ్ముతున్న టీకాల ధరకూ, ప్రజలు చెల్లిస్తున్న రేటుకూ మధ్య తేడాపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించడంపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పారు. ఇది శాస్త్ర,సాంకేతిక శాఖకు సంబంధించిన కమిటీ అని, టీకాల కొనుగోలు, ధరలతో శాఖకు సంబంధం లేదని బీజేపీ ఎంపీ ఒకరు స్పష్టం చేశారు.