భారత్‌లో కోవిడ్ ‘వ్యాక్సిన్ సెంచరీ’

ABN , First Publish Date - 2021-10-21T16:30:55+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో భారత్ గొప్ప ఘనత సృష్టించిందని

భారత్‌లో కోవిడ్ ‘వ్యాక్సిన్ సెంచరీ’

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో భారత్ గొప్ప ఘనత సృష్టించిందని ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం.


దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి  తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది. 


ఈ చరిత్రాత్మక ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఓ పాటను ఆవిష్కరించడంతోపాటు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద అతి పెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. 


2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం కోసం డ్రోన్లను కూడా ఉపయోగించడం విశేషం.


Updated Date - 2021-10-21T16:30:55+05:30 IST