వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-06-17T05:26:50+05:30 IST
ఏపీలో కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు వేగవంతంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.
- టీడీపీ నాయకుల డిమాండ్
గోస్పాడు, జూన్ 16: ఏపీలో కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు వేగవంతంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు బుధవారం గోస్పాడు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, రాజకీయ కక్షలే తప్ప అభివృద్ధి జరగడంలేదని, ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులను తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జి ఏరాసు చంద్రశేఖర్రెడ్డి, నాయకులు వీరసింహారెడ్డి, విశ్వనాథ్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఈశ్వర్రెడ్డి, జయసింహారెడ్డి, పెద్ద హుసేని పాల్గొన్నారు.
ఓర్వకల్లు: కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి కోరారు. టీడీపీ రాష్ట్ర పిలుపు మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి.. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సతీ్షకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ చంద్రన్న బీమా కొనసాగి ఉంటే కొవిడ్తో మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు వచ్చేవని, ప్రతి కొవిడ్తో మృతి కుటుంబానికి రూ.10 లక్షలు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ కొరతతో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి రేషన్ కార్డుదారునికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాన కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, అన్వర్, గోపాల్ రెడ్డి, అల్లాబాబు పాల్గొన్నారు.
నందికొట్కూరు: కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని టీడీపీ నాయకులు తహసీల్దార్ రాజశేఖర్బాబుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు, పగిడ్యాల టీడీపీ మండల కన్వీనర్లు ఓబుల్రెడ్డి, మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందన్నారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక వేలాది మంది మరణించారన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేలు సొమ్ము పేదలకు చేరలేదని తెలిపారు. చంద్రన్న బీమా కొనసాగి ఉంటే కొవిడ్తో మృతిచెందిన కుటుంబాలకు రూ.10లక్షలు వచ్చేవని తెలిపారు.
పాణ్యం: కరోనా కోరల్లో చిక్కుకొని ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలని టీడీపి నాయకులు కోరారు. బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో కరోనా సమస్యలపై తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు, మృతుల కుటుంబాలకు రూ. 10 వేల ఆర్థిక సాయమందించాలని కోరారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరారు. బ్లాక్ఫంగస్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్గ్రేషియో అందించాని కోరారు. కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 వేలు సాయం పేదలకు చేరడం లేదన్నారు. కరోనాతో ఉపాఽధి కోల్పోయిన ప్రజలపై పన్నుల భారం మోపడం సరి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు ఖాదర్బాషా, వెంకటాద్రి, కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
పాములపాడు: కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు తక్షణసాయంగా పది వేల రూపాయలను అందించాలని మండల టీడీపీ అధ్యక్షుడు చెల్లె హరినాఽథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ వేణుగోపాలరావుకు టీడీపీ నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు కల్పించాలని, బ్లాక్ ఫంగస్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు రవి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గడివేముల: కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నాయకుడు దేశం సత్యనారాయణరెడ్డి కోరారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రన్న బీమా కొనసాగి ఉంటే కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలు వచ్చి ఉండేవని అన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ఆక్సిజన్ లేక మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.20 లక్షలు పరిహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగశేషులు, నారాయణరెడ్డి, శ్రీకాంతు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.