వ్యాక్సినేషన్లో చెన్నై ఫస్ట్
ABN , First Publish Date - 2021-06-20T15:46:19+05:30 IST
కరోనా టీకాపై రాష్ట్ర రాజధాని నగరం చెన్నై ప్రజల్లో అవగాహన పెరిగింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలను తలదన్ని వ్యాక్సినేషన్లో చెన్నై ముందంజలో నిలవడమే ఇందుకు ఉదాహరణగా నిలిచిం
- - ముంబై, ఢిల్లీ కంటే ముందంజలో మన నగరం
చెన్నై: కరోనా టీకాపై రాష్ట్ర రాజధాని నగరం చెన్నై ప్రజల్లో అవగాహన పెరిగింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలను తలదన్ని వ్యాక్సినేషన్లో చెన్నై ముందంజలో నిలవడమే ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఈనెల 17వ తేదీ వరకు దేశంలోని నగరాలవారీగా గణించి చూడగా, చెన్నైలోనే అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్నట్టు తేలింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలను వెనక్కినెట్టి చెన్నై ముందంజలో నిలిచింది. గ్రేటర్ చెన్నై అధికారులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదినుంచి చెన్నై వాసులు కరోనా టీకా తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. స్వచ్ఛందంగా టీకా పంపిణీ కేంద్రాలకు తరలివస్తున్నారు. కొవీషీల్డ్, కొవాగ్జిన్ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆ మహమ్మారిని కట్టడి చేసేలా కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించే పనులు ప్రారంభించిన కేంద్రం ఇప్పటివరకు 27 కోట్లమందికి పైగా వ్యాక్సిన్లు అందించింది. ఈ నేపథ్యంలో, వ్యాక్సినేషన్ డ్రైవ్లో జనాభా సంఖ్య ఆధారంగా నిర్వహించిన సర్వేలో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాల కంటే చెన్నై ప్రథమస్థానంలో నిలిచింది. ‘కొవిన్’ వెబ్సైట్ ద్వారా ఈ నెల 17వ తేదీ వరకు టీకాలు వేయించుకున్న వారిలో చెన్నైవాసులు అగ్రస్థానంలో ఉన్నారని తేలింది. 24.4 శాతం మంది కరోనా టీకా మొదటి డోస్ వేసుకున్నారని, రెండవ డోస్ తీసుకున్నవారి సంఖ్య 7.5 శాతంగా ఉందని స్పష్టమైంది. 18 ఏళ్లు పైబడిన వారిలో 31.1 శాతం మంది మొదటి డోస్, 10.8 శాతం మంది రెండవ డోస్ వేయించుకున్నట్టు సర్వేలో తేలింది.