వ్యాక్సిన్ వస్తేనే వేసేది
ABN , First Publish Date - 2021-04-16T05:34:47+05:30 IST
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. మంగళ, బుధవారాల్లో జిల్లాకు 50వేల డోసులు రాగా గురువారం సాయంత్రంతో అయ్యిపోయాయి. రాష్ట్రంలో సెకండ్వేవ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజానీకం వ్యాక్సిన్ వేయించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
జిల్లాలో 50వేల డోసులు ఖాళీ
నేడు వ్యాక్సినేషన్ కొనసాగింపు కష్టమే
ఒంగోలు(కలెక్టరేట్), ఏప్రిల్ 15 : జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. మంగళ, బుధవారాల్లో జిల్లాకు 50వేల డోసులు రాగా గురువారం సాయంత్రంతో అయ్యిపోయాయి. రాష్ట్రంలో సెకండ్వేవ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజానీకం వ్యాక్సిన్ వేయించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఐదారు రోజుల నుంచి జిల్లాలో కరోనా టీకా అంతంతమాత్రంగానే అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారంలోనే సోమ, మంగళవారాల్లో వ్యాక్సినేషన్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రభుత్వం జిల్లాకు మంగళ, బుఽధవారాల్లో 50వేల డోసులు పంపింది. బుధవారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 149 కేంద్రాల్లో 42,411 మందికి టీకా వేశారు. మిగిలిన 7,589 టీకాలను గురువారం కొనసాగించారు. దీంతో వ్యాక్సినేషన్ పూర్తిగా అయిపోవడంతో శుక్రవారం ఈ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనేది తెలియని పరిస్థితి ఏర్పడింది.
టీకా వస్తేనే వేసేది
కాగా కరోనా వ్యాక్సిన్ ఢిల్లీ నుంచి గన్నవరం వస్తుంది. అక్కడి నుంచి జిల్లాలకు సరఫరా చేస్తారు. జిల్లా స్టోర్ పాయింట్ నుంచి పీహెచ్సీలకు తరలిస్తారు. అయితే రాష్ట్రస్థాయిలోనే పూర్తిగా వ్యాకిన్ కొరత ఏర్పడినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం గన్నవరం వచ్చిన వ్యాక్సిన్ వైయల్స్ జిల్లాకు రాగా వచ్చిన రెండు రోజుల్లోనే ఖాళీఅయ్యాయి. దీంతో టీకాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.