425 పోస్టులు ఖాళీ

ABN , First Publish Date - 2021-01-25T07:18:14+05:30 IST

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో

425 పోస్టులు ఖాళీ

జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో వేకెన్సీలు 

ప్రమోషన్‌ నోటిఫికేషన్‌కు టీచర్ల ఎదురుచూపులు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. కేడర్‌ స్ర్టెంత్‌కు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీలున్నాయనే దానిపై 20 రోజులుగా వివరాలు సేకరించిన అధికారులు తుదిజాబితాను సిద్ధం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ప్రధానోపాధ్యాయుల పోస్టులను సైతం భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పదోన్నతి పొందేందుకు ఎంతమంది అర్హులున్నారనే సీనియారిటీ లిస్టును సైతం తయారు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే జాబితాను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 689 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు 4,600 మంది వరకు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 1200 నుంచి 1500 మంది కొన్నేళ్ల నుంచి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కొంతమంది ప్రమోషన్‌ పొందకుండానే ఉద్యోగ విరమణ చేశారు. పదోన్నతులు, పీఆర్‌సీ, ఉద్యోగ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల సర్వీసుతో పనిచేస్తూ మరో రెండు, మూడేళ్లలో రిటైర్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న వందలాది మంది ఈసారైనా ప్రమోషన్‌ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. 


స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో...

జిల్లాలోని తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు దాదాపు 425 వరకు ఖాళీగా ఉన్నాయి. గతంలో టీఆర్‌టీ కింద భర్తీ చేసిన పోస్టుల్లో చాలావరకు ఎస్‌జీటీ కేడర్‌కు సంబంధించినవే ఉన్నాయని, స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త పోస్టులు నింపకపోవడంతోపాటు ప్రమోషన్లు లేకపోవడంతో కొన్నేళ్లుగా అవి ఖాళీగా ఉంటున్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా సబ్జెక్టుల వారీగా ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో సీనియారిటీ ప్రాతిపదికన అర్హులకు పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తక్షణమే ప్రమోషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ముత్యాల రవీందర్‌, శ్యామ్‌ ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-01-25T07:18:14+05:30 IST